కేసీఆర్, కోమటిరెడ్డిలు ఎన్నటికీ జాతిపితలు కాలేరు
తెలంగాణ కోసం పార్టీనే ఎదిరించి… సర్వస్వం కోల్పోయా
నల్గొండ పర్యటనలో మంత్రి కోమటిరెడ్డి
ముద్ర, నల్గొండ :
బీఆర్ఎస్ నేతలకు జాతిపిత అంటే అసలు అర్ధం తెలియదని రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. మంగళవారం నల్గొండలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన అక్కడ మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ప్రాణత్యాగం చేసిన అమరులే జాతిపితలు అని అన్నారు. తెలంగాణ దేవత సోనియా గాంధీ అని ప్రకటించారు. కేసీఆర్ తెలంగాణ జాతిపిత అయితే.. నేనూ జాతిపితనే అన్నారు. తెలంగాణ కోసం సొంత పార్టీని ఎదిరించా, పదవులకు రాజీనామాలు చేసి సర్వం కోల్పోయా అని గుర్తుచేశారు. అయినా కేసీఆర్, కోమటిరెడ్డిలు ఎన్నటికీ జాతిపితలు కాలేరని తెలిపారు. ఈ నెల 11న జరగనున్న మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి మరోసారి పరాభవం తప్పదన్నారు. సర్పంచ్, అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల ఫలితాలే మున్సిపల్ ఎన్నికల్లోనూ పునరావృత్తం అవుతాయన్నారు. ఈ ఎన్నికల్లో 5 కార్పొరేషన్లు, 90 మున్సిపాలిటీలు కైవసం చేసుకుంటాం.. నల్లగొండ కార్పొరేషన్పై కాంగ్రెస్ జెండా ఎగరేస్తామని ధీమా వ్యక్తం చేశారు. చివరకు వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి రాష్ట్రంలో బీఆర్ఎస్ కనుమరుగు కావడం ఖాయమన్నారు.