- బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్.
ముద్ర, తెలంగాణ బ్యూరో : టీపీసీసీ ప్రస్తుత కమిటీల నియామకం ఉదయపూర్ డిక్లరేషన్కు విరుద్ధంగా ఉన్నాయని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ విమర్శించారు. కుల గణన ఆత్మకి, సామాజిక న్యాయతత్వానికి విరుద్ధంగా టీపీసీసీలో కమిటీలను ఏఐసీసీ ఆమెదించిందని ఆయన పేర్కొన్నారు. ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలు, మహిళలు దేశానికి బలస్థంబాలని ఆయన తెలిపారు. అయితే రాహుల్ గాందీ నినాదించిన ‘జిత్నీ ఆబాదీ, ఉత్తనా హక్’ ఆత్మ ఈ నియామకాలలో ఎక్కడ ఉంది? అని ఆయన ప్రశ్నించారు. ఈ కమిటీలు ఎలైట్ వర్గాలు, ఫ్యూడల్ శక్తుల ఆధిపత్యంతో నిండిపోయినట్లుగా కనిపిస్తున్నాయని అన్నారు. తక్కువ వర్గాలను వ్యవస్థాపితంగా అణిచివేయడమే కాక, వారి రాజకీయ శక్తిని పూర్తిగా నిరాకరించారని ఆయన దుయ్యబట్టారు. మహిళలకు న్యాయమైన ప్రాతినిధ్యం ఇవ్వకుండా కాంగ్రెస్ పార్టీ తమ పబ్లిక్ స్టేజిలపై లింగ సమానత్వంపై చేసే ప్రసంగాలు కేవలం బూటకం అని తేలిపోయిందని ఎమ్మెల్సీ దాసోజు అభిప్రాయపడ్డారు. రాష్ట్ర ఆర్థిక కమిషన్, వ్యవసాయ కమిషన్ లాంటి రాజ్యాంగ పదవులు నిర్వర్తిస్తున్న నేతలనే మళ్ళీ పార్టీ లోపలి కీలక పదవుల్లో నియమించడం చట్టరీత్యా పెద్ద తప్పిదమన్నారు. ఉదయపూర్ డిక్లరేషన్ కేంద్రంగా పేర్కొన్న, వికేంద్రీకరణ, సబ్బండ వర్గాల ప్రాతినిధ్యం అన్నవి ఇప్పుడున్న కమిటీల్లో ఎక్కడా కనిపించడంలేదని దాసోజు విమర్శించారు.