- సింగరేణి వ్యాప్తంగా 675 హెక్టార్లలో నాటనున్న 40 లక్షల మొక్కలు.
- ఇప్పటికే ఫలితమిచ్చిన ‘నీటి బిందువు – జలసింధువు’
- 48 నూతన చెరువుల నిర్మాణం.. 25కి పైగా చెరువుల్లో పూడిక తీత.
- మరో వారంలో మిగిలిన చెరువులు పూర్తిచేయాలి.
- సింగరేణి సీఎండీ బలరామ్.
ముద్ర, తెలంగాణ బ్యూరో : వర్షాకాలం ప్రారంభమైన నేపథ్యంలో జూన్ ఒకటో తేది నుంచి సింగరేణి వ్యాప్తంగా పెద్ద ఎత్తున వన మహోత్సవ కార్యక్రమాలను చేపట్టాలని ఆ సంస్థ సీఎండీ బలరామ్ ఆదేశించారు. ఈ ఏడాది 675 హెక్టార్లలో 40 లక్షల మొక్కలను నాటి సంరక్షించాలన్నారు. సింగరేణి ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నీటి బిందువు – జల సింధువు కార్యక్రమం ప్రగతి, అలాగే వన మహోత్సవం కోసం ఏర్పాట్లపై ఆయన సంస్థ డైరెక్టర్లు, అన్ని ఏరియాల జీఎంలు, అటవీ, పర్యావరణ శాఖలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఏరియాల వారీగా వన మహోత్సవ లక్ష్యాలను ఈ సందర్భంగా అడిగి తెలుసుకున్నారు. నిర్ణీత లక్ష్యాల మేరకు మొక్కలు నాటాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు వనమహోత్సవాన్ని ప్రతి ఏరియాలో ఉత్సాహంగా నిర్వహించాలని, కార్మికులు, స్థానికులు పాల్గొనేలా చూడాలని సూచించారు. అలాగే సింగరేణి వ్యాప్తంగా భూగర్భ జలాల పెంపుదలకు సంస్థ చేపట్టిన నీటి బిందువు-జలసింధువు కార్యక్రమం పై కూడా ఆయన సమీక్షించారు. సింగరేణి ప్రాంతంలో మొత్తం 62 మినీ చెరువులను తవ్వాలని నిర్ణయించగా వీటిలో ఇప్పటికే 48 చెరువుల నిర్మాణం పూర్తవడంపై సంతృప్తిని వ్యక్తం చేశారు. ఇంకా మిగిలిన మినీ చెరువుల నిర్మాణం వారం లోగా పూర్తి చేయాలని కోరారు. ఇప్పటికే ఆయా ఏరియాల్లో ఉన్న చెరువుల్లో 43 చెరువుల్లో పూడికతీత పనులను పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్దేశించగా.. ఇందులో 25 చెరువుల్లో పనులు పూర్తయినట్లు ఏరియా అధికారులు వివరించారు. వీటిని స్థానిక ప్రభుత్వ యంత్రాంగాన్ని సమన్వయం చేసుకుంటూ వీలైనంత త్వరగా పూర్తి చేయాలని స్పష్టం చేశారు. వీటిని పూర్తి చేయడం ద్వారా సింగరేణి ఆధ్వర్యంలో 105 నూతన చెరువుల నిర్మాణం, పూడికతీత చేసినట్లు అవుతుందని, ఇది అతి పెద్ద సామాజిక ప్రయోజన కార్యక్రమంగా నిలిచిపోతుందన్నారు. వర్షాకాలంలో కొత్తగా ఏర్పాటు చేసిన చెరువుల్లో నీరు చేరే విధంగా తగు సివిల్ పనులు పూర్తి చేయాలని, నీటి నిలువ గరిష్టంగా ఉండేలా చూడాలని సూచించారు. పనుల్లో నాణ్యత ఉండాలని, చెరువు కట్టలు పటిష్టంగా ఉండే విధంగా తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. రానున్న రోజుల్లో 105 చెరువులను స్వయంగా పరిశీలిస్తానని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు. సమావేశంలో సంస్థ డైరెక్టర్ ఆపరేషన్స్ ఎల్.వి.సూర్యనారాయణ, డైరెక్టర్ పిపి, పా కె.వెంకటేశ్వర్లు, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కోల్ మూమెంట్ ఎస్.డి.ఎం.సుభాని, సింగరేణి అటవీశాఖ సలహాదారులు మోహన్ పరిగేన్, జీఎం సీపీపీ ఎ.మనోహర్, జీఎం(ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్రీ) సైదులు ఇంకా వివిధ విభాగాల అధికారులు, ఏరియాల నుంచి జనరల్ మేనేజర్లు పాల్గొన్నారు.
