ముద్ర కాప్రా
మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలనే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘ఇందిరా మహిళా శక్తి’ పథకం క్షేత్రస్థాయిలో ఫలితాలు ఇస్తోంది. ఈ పథకం ద్వారా మహిళలు వ్యాపారవేత్తలుగా ముందుకు వస్తుండగా, మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని కాప్రా సర్కిల్లో మరో అడుగు పడింది. ఏ.ఎస్.రావు నగర్ జపనీస్ థీమ్ పార్క్ వద్ద ‘విజయ తెలంగాణ డెయిరీ పార్లర్’ శనివారం ఘనంగా ప్రారంభమైంది.
ఈ పార్లర్ను కాప్రా సర్కిల్ డిప్యూటీ కమిషనర్ శ్రీహరి, విజయ డెయిరీ జనరల్ మేనేజర్ శ్రీనివాసరావు, డిప్యూటీ జీఎం అరుణ్ కుమార్లు సంయుక్తంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహిళా సంఘాల ఆర్థిక బలోపేతమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు. గతంలో చిన్నపాటి పొదుపు కార్యకలాపాలకు మాత్రమే పరిమితమైన మహిళలు, ఇప్పుడు ప్రభుత్వ రంగ సంస్థలతో భాగస్వామ్యంగా వ్యాపారాలు నిర్వహించడం అభినందనీయమన్నారు.
‘సాయి సిద్ధి స్వశక్తి పొదుపు సంఘం’ సభ్యులు ఈ పార్లర్ నిర్వహణ బాధ్యతలు చేపట్టగా, తెలంగాణ గ్రామీణ బ్యాంక్ ద్వారా రూ. 2 లక్షల రుణం మంజూరైంది. ఈ నిధులతో ఏర్పాటు చేసిన ఈ కేంద్రంలో నాణ్యమైన పాల ఉత్పత్తులను వినియోగదారులకు అందుబాటులో ఉంచారు. ప్రాజెక్ట్ ఆఫీసర్ సురేష్, కమ్యూనిటీ ఆర్గనైజర్ శ్రీనివాస్ రెడ్డి, గోపాల్ మాట్లాడుతూ జపనీస్ థీమ్ పార్క్కు వచ్చే సందర్శకులకు ఈ కేంద్రం ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు.