వేకువ జామున మూడు గంటల నుండి అక్షరభ్యాస పూజలు
దక్షిణ భారత దేశంలోనే సుప్రసిద్ధమైన సరస్వతీ క్షేత్రం నిర్మల్ జిల్లా బాసరలోని శ్రీ జ్ఞాన సరస్వతి ఆలయంలో వసంత పంచమి వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. అమ్మవారి జన్మదినం వసంత పంచమి సందర్భంగా భక్తులు శుక్రవారం ఆలయానికి భారీగా తరలి వచ్చారు. తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాల నుండీ వచ్చి మొక్కులు తీర్చుకున్నారు. వేకువ జామున రెండు గంటల నుండి క్యూలైన్లలో భక్తులు నిలబడి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. సుప్రభాత సేవతో అమ్మవారి పూజా కార్యక్రమాలు ప్రారంభం కాగా…ఆలయ వైదిక బృందం సరస్వతి, మహాకాళి, మహాలక్ష్మి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించింది. వేకువ జామున మూడు గంటల నుండి అక్షరభ్యాస పూజలు ప్రారంభించారు. భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చి చిన్నారులకు అక్షర శ్రీకార పూజలు నిర్వహించారు. ఇందుకోసం ఆలయంలో ప్రత్యేకంగా మూడు అక్షరాభ్యాస మండపాలను ఏర్పాటు చేశారు. వేద వ్యాసుడు ప్రతిష్టించిన ఈ ఆలయంలో ప్రతి ఏటా వసంత పంచమి వేడుకలను వైభవంగా నిర్వహిస్తారు. మాఘ మాసంలో వచ్చే మాఘ శుద్ధ పంచమిని వసంత పంచమిగా నిర్వహిస్తారు.