Take a fresh look at your lifestyle.

సెల్ ఫోన్ దొంగల ముఠా గుట్టురట్టు -25 ఖరీదైన ఫోన్లు స్వాధీనం. -సీసీస్ ఇన్స్పెక్టర్, బల్వంత్ రాయ్

ముద్ర, వికారాబాద్ జిల్లా ప్రతినిధి :
వికారాబాద్ జిల్లాలో రద్దీగా ఉండే కూరగాయల మార్కెట్ ప్రాంతాలలో ఖరీదైన సెల్ ఫోన్లను లక్ష్యంగా చేసుకొని దొంగతనాలకు పాల్పడుతున్న ముఠాను జిల్లా సి‌సి‌ఎస్ పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. జిల్లాలో సెల్ ఫోన్ దొంగతనాలను నివారించడానికి జిల్లా ఎస్పీ శ్రీమతి స్నేహ మెహ్రా ఆదేశాల మేరకు జిల్లా సీసీఎస్ ఇన్స్పెక్టర్ బల్వంత్ రాయ్, వికారాబాద్ టౌన్ ఇన్స్పెక్టర్ రఘు కుమార్ ల ఆధ్వర్యంలో ప్రత్యేక బృందం ఏర్పాటు చేసి దర్యాప్తు చేపట్టారు. జిల్లాలోని వికారాబాద్, బొంరాస్‌పేట్ పోలీస్ స్టేషన్ల పరిధిలో నమోదైన సెల్ ఫోన్ దొంగతన కేసులపై దర్యాప్తు ప్రారంభించిన సీసీఎస్ బృందం, సీసీటీవీ ఫుటేజ్ మరియు టెక్నికల్ ఆధారాలను విశ్లేషించి నిందితుల కదలికలను గుర్తించింది. ఈ క్రమంలో సెల్ ఫోన్ దొంగతనాలకు పాల్పడుతున్న ముఠాను గుర్తించి, కే. రవి అలియాస్ గౌరి (డోన్ మండలం, కర్నూలు జిల్లా, ఆంధ్రప్రదేశ్)ను అదుపులోకి తీసుకున్నారు.
విచారణలో నిందితుడు తనతో పాటు మరో ఐదుగురు పెద్దవారు, ముగ్గురు మైనర్ బాలుర సహాయంతో వికారాబాద్ పోలీస్ స్టేషన్, బొంరాస్ పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలలో జిల్లాలోని రద్దీ ప్రాంతాలలో దొంగతనాలు చేస్తున్నట్లు తెలిపారు. ఈ ముఠా సభ్యులు ఆటోలు బైక్‌లపై తిరుగుతూ, రద్దీ మార్కెట్‌లలో ఖరీదైన సెల్ ఫోన్‌లను లక్ష్యంగా చేసుకుని, ప్రజలు కూరగాయలు కొనుగోలు చేస్తూ అప్రమత్తంగా లేని సమయంలో మైనర్ బాలురతో దొంగతనాలు చేయించేవారు. అనంతరం సెల్ ఫోన్‌లను వెంటనే ముఠా సభ్యుల మధ్య మార్చుకుంటూ ఆధారాలు లేకుండా చేశారని తెలిపారు.
సి‌సి‌ఎస్ పోలీసులు, వికారాబాద్ పోలీసులు నిందితులు అద్దెకు తీసుకున్న నివాస ప్రాంతంలో సోదాలు నిర్వహించి, మొత్తం 25 సెల్ ఫోన్‌లను స్వాధీనం చేసుకున్నారు. కేసులో నిందితులుగా కే. రవి అలియాస్ గౌరి, బి. మహేష్, ఆకుల కార్తీక్, వడ్డె మురళి, వడ్డె వెంకటేష్ సంపంగి తిరుపతిలను గుర్తించారు. ఈ సందర్భంగా జిల్లా సీసీస్ ఇన్స్పెక్టర్ బల్వంత్ రాయ్ మాట్లాడుతూ రద్దీ ప్రదేశాలలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఖరీదైన మొబైల్ ఫోన్‌లను జాగ్రత్తగా ఉంచుకోవాలని, ఎటువంటి అనుమానాస్పద వ్యక్తులు గమనించిన వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌కు సమాచారం ఇవ్వాలన్నారు. సెల్ ఫోన్ దొంగతనాలు చిన్న నేరాలు కావని, వీటిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నాము. ఈ ముఠా పట్టుబడటంలో కీలకంగా వ్యవహరించిన సీసీస్ టీం, వికారాబాద్ పోలీస్ టీం సిబ్బందిని అభినందించారు . నేరస్థులందరూ పాత నేరస్థులేనని, వారిపైన వివిధ పోలీస్ స్టేషన్ లలో పలు కేసులు నమోదు అయి ఉన్నాయని తెలిపినారు.
అరెస్టయిన నిందితుల వివరాలు ఈ విధంగా ఉన్నాయి
కె. రవి (అలియాస్ గౌరి): కర్నూలు జిల్లా, ఆంధ్రప్రదేశ్, మహేష్: మహబూబ్ నగర్ జిల్లా, ఆకుల కార్తీక్: శేరిలింగంపల్లి, హైదరాబాద్.
, వడ్డే మురళి: జడ్చర్ల, మహబూబ్ నగర్ జిల్లా, వడ్డే వెంకటేష్: బాలానగర్, మహబూబ్ నగర్ జిల్లా, సంపంగి తిరుపతి: పాపిరెడ్డి కాలనీ, హైదరాబాద్.
వికారాబాద్, బొంరాస్ పేట్ పోలీస్ స్టేషన్ లలో చోరీ అయిన సెల్ సెల్ ఫోన్ లతో పాటు
సుమారు 3,75,000 రూపాయల విలువ కల్గిన మొత్తం 25 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో వికారాబాద్ టౌన్ ఇన్స్పెక్టర్ రఘు కుమార్, సీసీస్ ఎస్.ఐ రమేష్, రాజు, రామ కృష్ణ, రవీందర్, రమేష్, ముని రాజ్ లు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.