ముద్ర ప్రతినిధి, జగిత్యాల: జగిత్యాల మునిసిపాలిటీలో 100 రోజుల కార్యాచరణ ప్రణాళిక కింద నగరంలో వ్యర్థ నివారణ, డ్రెయిన్లు, వాగులు, ప్రభుత్వ భూముల శుభ్రపరిచే పనులను త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ బి . సత్య ప్రకాష్ ఆదేశించారు. శుక్రవారం పట్టణంలోని పలు మురికి కాలువలను జిల్లా కలెక్టర్ పరిశీలించారు.గోవిందపల్లి కాలువ, రామాలయం పక్కన ఉన్నదేవాదాయ శాఖ భూములు, పెద్ద నాలా, ఎస్ ఆర్ ఎస్ పీ కాలువ వద్ద,శంకులపల్లి , సోడా సెంటర్ ప్రాంతాల్లో ప్రధానంగా డ్రెయిన్లు, వాగులు, కలుషిత ప్రాంతాలను శుభ్రపరచడం కోసం ప్రత్యేక చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని కలెక్టర్ సూచించారు.ఈ కార్యక్రమాలను డ్రైవ్ మోడ్లో తీసుకోవాలని, మునిసిపల్, నీటిపారుదల, దేవదాయ శాఖల మధ్య సమన్వయం కావాలని ఆదేశించారు. ప్రైవేట్ భూముల యజమానులు తమ భూముల్లోని ముల్ల మొక్కలు, చెట్ల పొదలు తొలగించకపోతే, జరిమానాలు విధించి, ఆ మొత్తం డబ్బుతో శుభ్రత పనులు చేపట్టాలని కలెక్టర్ సూచించారు.ఈ పనుల్లో అధికారులు అత్యంత చురుకుగా పాల్గొనాలని, ప్రజలకు కనిపించేలా పర్యావరణ పరిశుభ్రత కనిపించాలన్నారు.అన్ని విభాగాల అధికారులు సమన్వయంతో, సమయానికి తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు.
