- ఆసుపత్రి తరలింపునకు ఏర్పాట్లు చేయాలి
- వేసవి నీటి సరఫరా కోసం సంసిద్దం కావాలి
- పెద్దపల్లి ఎంసిహెచ్ ఆసుపత్రి, బొంపల్లి పెద్దగుట్ట లోని పంపింగ్ స్టేషన్ల తనిఖీ
ముద్ర ప్రతినిధి, పెద్దపల్లి : జిల్లా జనరల్ ఆసుపత్రి లోని ఓపి కాంప్లెక్స్, డయాలసిస్ యూనిట్ లను ఎంసిహెచ్ లోకి తరలించేందుకు ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష అన్నారు. శనివారం పెద్దపల్లిలోని ఎంసిహెచ్ ఆసుపత్రి, పెద్దపల్లి మండలంలోని బొంపల్లి పెద్దగుట్ట లోని పంపింగ్ స్టేషన్లను తనిఖీ చేశారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ పెద్దపల్లి పట్టణంలో రూ.57 కోట్లతో నూతన ఆసుపత్రి భవనం నిర్మించేందుకు గాను పాతపడిపోయిన ఆసుపత్రి కూల్చివేయాలని ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చాయని, పాత భవనంలో ఉన్న ఓపి కాంప్లెక్స్,డయాలసిస్ యూనిట్ లను ఎంసిహెచ్ ఆసుపత్రి లోకి తరలించాలని కలెక్టర్ తెలిపారు.ఎంసిహెచ్ ఆసుపత్రి పరిశీలించిన కలెక్టర్ ఎక్కడ ఓపి కాంప్లెక్స్, డయాలసిస్ యూనిట్ ఏర్పాటు చేసే అవకాశం ఉందో పరిశీలించి 3 రోజుల్లో తుది ప్రణాళిక తయారు చేయాలని, తరలింపు ప్రక్రియ చేపట్టి పాత భవనం కూల్చివేత పనులు ప్రారంభమయ్యేలా కార్యాచరణ రూపొందించాలని అధికారులకు కలెక్టర్ సూచించారు.
అనంతరం జిల్లా కలెక్టర్ బొంపల్లి పెద్దగుట్టలోని మిషన్ భగీరథ ఇంటర్మీడియట్ పంపింగ్ స్టేషన్ ను పరిశీలించారు. పెద్దపల్లి అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో ఉన్న ఆరు మండలాలు, పెద్దపల్లి సుల్తానాబాద్ మున్సిపాలిటీలకు పంపింగ్ స్టేషన్ నుంచి తాగు నీరు సరఫరా జరుగుతుందని, రాబోయే వేసవిలో నీటి ఎద్దడి రాకుండా సజావుగా నీటి సరఫరా జరిగేలా చూడాలని, పంపింగ్ స్టేషన్లో ఏవైనా మరమ్మతులు ఉంటే వెంటనే చేపట్టి పూర్తి చేయాలని కలెక్టర్ సూచించారు.ఈ పర్యటనలో జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీధర్, ఆర్.ఎం.ఓ డాక్టర్ రవీందర్, డాక్టర్ వాసుదేవ రెడ్డి, ఈఈ మిషన్ భగీరథ పూర్ణ చందర్ రావు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.