ముద్ర, తాండూర్ :
ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక-99 రోజుల యాక్షన్ ప్లాన్ లో భాగంగా తాండూర్ నియోజకవర్గంలోని గౌతాపూర్ గ్రామంలో సర్పంచ్ జన్నె సుజనా అధ్యక్షతన నిర్వహించిన గ్రామసభకు ముఖ్య అతిథిగా తాండూర్ శాసనసభ్యులు మనోహర్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి జరిగిన అభివృద్ధి సంక్షేమ పథకాల నివేదికను ఆయా శాఖల అధికారులు గ్రామ సభలో వివరించారు. అనంతరం గ్రామసభను ఉద్దేశించి ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అన్ని వర్గాల ప్రజలకు అందించాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మార్చ్ 9 నుండి జూన్ 2 వరకు ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక అనే పేరుతో 99 రోజుల కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమం ద్వారా అన్ని శాఖల అధికారులను గ్రామస్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు అందరిని సమన్వయం చేస్తూ ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు చక్కటి అవకాశం ఉంటుందని ఆయన తెలిపారు. ముఖ్యంగా ఎన్నికల సమయంలో ఇచ్చిన వాగ్దానాలను దశలవారీగా పరిష్కరించడం జరుగుతుందని తెలిపారు. అధికారంలోకి వచ్చిన నాటి నుండి మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం, 200 యూనిట్ల ఉచిత కరెంట్, రూ. 500 కే సబ్సిడీపై గ్యాస్ సిలిండర్, మహిళలకు వడ్డీ లేని రుణాలు, ఇందిరమ్మ ఇల్లు, రేషన్ కార్డులు ఇలా ఎన్నో పథకాలను అమలు చేసి ప్రజల హృదయాల్లో సుఖ సంతోషాలు చూడడమే ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే పేర్కొన్నారు. అదేవిధంగా తాండూర్ నియోజకవర్గంలో రవాణా, విద్య, ఉపాధి అవకాశాలు మెరుగుపడడమే ధ్యేయంగా గ్రామ సర్పంచులు, మున్సిపల్ కౌన్సిలర్లు అందరి సమన్వయంతో ప్రజలకు సేవలు అందించడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో ఏ సి యు టి హర్ష సుధీర్ చౌదరి, ఆర్డీవో అనిత, మండల స్పెషల్ ఆఫీసర్ సత్తార్, మార్కెట్ కమిటీ చైర్మన్ పట్లోళ్ల నర్సింలు, మండల పార్టీ ప్రెసిడెంట్ నాగప్ప, వివిధ శాఖల అధికారులు పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.