విద్యుత్ దీపాలంకరణలతో జిగేలుమంటున్న యాదాద్రి..
పూల అలంకరణలతో ప్రధాన ఆలయం ఆధ్యాత్మికం..
మొదటి రోజు ప్రధానాలయంలో స్వస్తివాచనం, రక్షాబంధనం, విశ్వక్సేన ఆరాధన,
సాయంత్రం మృత్సం గ్రహణం అంకురారోపణం..

ముద్ర ప్రతినిధి, భువనగిరి :
తెలంగాణ తిరుపతి యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు బుధవారం ఆలయ అర్చకులు అంగరంగ వైభవంగా ప్రారంభించారు. బ్రహ్మోత్సవాలలో భాగంగా మొదటి రోజు ఉదయం 10 గంటలకు విశ్వక్సేన ఆరాధన, స్వస్తివాచనం, రక్షాబంధనం, నిర్వహించారు సాయంత్రం 6:30 కు మృత్వం గ్రహణం అంకరారోపణం నిర్వహించనున్నారు..
ఈ సందర్భంగా ఉదయం ఆలయ అర్చకుల వేదమంత్రాల ఘోషతో యాదాద్రి ఆలయం ఆధ్యాత్మికతను సంతరించుకుంది. ప్రత్యేకంగా పూజలు నిర్వహించిన కలశములోని జలముతో ప్రధానాలయ, మ
మాడవీధులలో, ఆలయం చుట్టూ కూడా అర్చకులు సంప్రోక్షణ చేశారు. బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహించుటకు ఆలయ అధికారులు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేశారు.
బ్రహ్మోత్సవాలకు దాదాపు 100 మంది రిత్వికులను ఆహ్వానించారు. ఉత్సవాల నేపథ్యంలో భక్తులకు ప్రతిరోజు 1500 మందికి భోజన వసతి, అవసరమైతే భక్తుల సంఖ్యను బట్టి ఇంకో 1000 మందికి కూడా ఏర్పాటు చేయడమైనదని అన్నారు. బ్రహ్మోత్సవాలలో నిర్వహింపబడు ప్రత్యేకమైన సేవలలో పాల్గొనాలి అనుకునే భక్తులు 20 వేల రూపాయలు (దంపతులకు మాత్రమే) చెల్లించి సేవలలో పాల్గొనవచ్చు అని తెలిపారు.
వీరికి అంతరాలయ దర్శనం స్వామి వారి కళ్యాణం కనుమ, అభిషేకం లడ్డు ప్రసాదంగా ఇవ్వబడుతుందని ఆలయ ఈవో భవాని శంకర్ తెలిపారు. సుమారు 2 కోట్ల రూపాయల బడ్జెట్ తో స్వామివారి బ్రహ్మోత్సవాలను న భూతో న భవిష్యతి అన్నట్లు అంగరంగ వైభవంగా నిర్వహింపబడతాయని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ నరసింహ మూర్తి, జిల్లా కలెక్టర్ హనుమంతరావు, అడిషనల్ కలెక్టర్ భాస్కరరావు, స్థానాచార్యులు కాండూరి వెంకటాచార్యులు, ప్రధానార్చకులు సురేంద్రాచార్యులు, డీఈవో దోర్బల భాస్కర్ శర్మ, ఏఈఓ గజవెల్లి రఘు, సూపరిండెంట్ సీతారామ చారి, ఉప ప్రధానార్చకులు మంగళగిరి నరసింహమూర్తి, మాధవాచార్యులు, లక్ష్మణాచార్యులు, ముఖ్య అర్చకులు వెంకటాచార్యులు, కిరణ్ కుమారాచార్యులు ఆలయ సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు.
