ముద్ర ప్రతినిధి, నిర్మల్:
నిర్మల్ భాగ్యనగర్ కు చెందిన వరణ్య అనే చిన్నారి 4000 అడుగుల ఎత్తైన మంచు పర్వతంపై -4 °C లో కూచిపూడి నృత్యం చేయడం అద్భుతమని బీజేఎల్పీ నేత, ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో చిన్నారిని మంగళవారం అభినందించి శాలువాతో సత్కరించారు. జమ్మూ కాశ్మీర్ బారాముల జిల్లా గుల్మార్గ్ ప్రాంతంలోని ఆఫర్వాత్ పర్వతంపై “శ్రీ విజ్ఞరాజం భజే” అంటూ కూచిపూడి నృత్యం చేయడం అభినందనీయమని, రాబోయే రోజుల్లో మరిన్ని ప్రదర్శనలు ఇచ్చి నిర్మల్ కీర్తి ప్రతిష్టను ప్రపంచ దేశాలకు చాటాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ ఖమ్మం సురేందర్, మాజీ ఎంపీపీ రమేష్, నాయకులు రాజేశ్వర్, జీవన్ రెడ్డి, మల్లేష్ తో పాటు తదితరులు పాల్గొన్నారు.