- ప్రభుత్వ, ఎయిడెడ్ విద్యార్ధులకే అమలు
- ఉత్తర్వులు జారీ చేసిన సర్కార్
ముద్ర, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో దివ్యాంగులకు ప్రభుత్వం తీపికబురు వినిపించింది. ప్రభుత్వ, ఎయిడెడ్ ఉన్నత విద్యాసంస్థల్లో వారికి ఐదు శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీచేసింది. విద్యాసంస్థల్లో ఆయా వర్గాల ప్రవేశాలకు గరిష్ఠ వయోపరిమితిలోనూ ఐదేళ్లు మినహాయింపు ఇచ్చింది. దివ్యాంగుల హక్కుల చట్టంలోని నిబంధనల మేరకు ఈ చర్యలు చేపట్టింది.దివ్యాంగులను ఐదు కేటగిరీలుగా విభజించి, ఒక్కో కేటగిరీ వైకల్యానికి ఒక్కో శాతం రిజర్వేషన్ అమలు చేయనుంది.
ఈమేరకు ఉన్నత విద్యాశాఖ కార్యదర్శి యోగితారాణా ఉత్తర్వులు జారీచేశారు. దృష్టి లోపం- ఏ కేటగిరీ, వినికిడి లోపం, మూగ- బీ కేటగిరీ,అంగవైకల్యం- సీ, మానసిక వైకల్యం- డీ, ఒకటికి మించిన వైకల్యాలు- ఈ కేటగిరీగా విభజించింది. ఈ కేటగిరీల అభ్యర్థులకు విద్యాసంస్థల్లో ప్రవేశాలకు ఒక్కో శాతం చొప్పున రిజర్వేషన్ అమలు చేయనుంది. ఈ రిజర్వేషన్ రొటేషన్ కింద కొనసాగుతుంది.ఉదాహరణకు ఒక కేటగిరీలో అర్హులైన అభ్యర్థులు లేకుంటే తదుపరి రిజర్వేషన్ కేటగిరీ అభ్యర్థికి అవకాశం కల్పిస్తారు.ప్రవేశాల్లో దివ్యాంగులైన అభ్యర్థులే లేకుంటే ఆ ఖాళీలను సంబంధిత రిజర్వుడు (ఎస్సీ,ఎస్టీ,బీసీ) వర్గాల్లోని సాధారణ అభ్యర్థులతో మెరిట్ ఆధారంగా భర్తీ చేస్తారు.