ముద్ర ప్రతినిధి, సిద్దిపేట :
రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్ కాంగ్రెస్ ప్రభుత్వం తాను ఇచ్చిన హామీలను అటకెక్కించిందని బడ్జెట్లో కేటాయింపులు చేయకుండా హామీలను విస్మరించిందని సిపిఎం సిద్దిపేట జిల్లా కార్యదర్శి అముదాల మల్లారెడ్డి విమార్షించారు. శుక్రవారం అసెంబ్లీలో ప్రవేశ పెట్టిన 3,24,234 కోట్ల బడ్జెట్లో పేదలకు ఇచ్చిన హామీలకు కేటాయింపులు చేయకుండా ప్రజలను మభ్యపెడుతుందని అన్నారు. బడ్జెట్లో మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలకు 2500 రూపాయలు, నిరుద్యోగ యువతకు నిరుద్యోగ భృతి, ఆశ వర్కర్లకు జీతాల పెంపు, వృద్ధాప్య, వితంతు, వికలాంగుల పెన్షన్ల పెంపు, ఉద్యోగుల పి ఆర్ సి లాంటి ఎన్నో వాగ్దానాలకు కేటాయింపులు చేయకుండా మొండి చేయి చూపారని ఇది ప్రజలను మోసగించే బడ్జెట్ అన్నారు.ప్రజలకు సేవలు అందించే మౌలిక రంగాలకు విద్యా, వైద్యం తదితర రంగాలకు బడ్జెట్లో కేటాయింపులు సరిగ్గా చేయకుండా అన్ని వర్గాల ప్రజలకు నష్టం చేకూర్చే విధంగా ఉందని అన్నారు. అసెంబ్లీలో ఆర్థికమంత్రి ప్రసంగం భారీ హామీలను నెరవేరుస్తున్నట్టు వినిపించినా ఏ ఒక్క హామీని పరిష్కరించిన బడ్జెట్ గా కేటాయింపులు ఉన్నాయని విమర్శించారు. పేదల అభ్యున్నతి కోసం ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా బడ్జెట్ రూపొందించాలని ఈ బడ్జెట్ పేదల బడ్జెట్ కాదని పెద్దల బడ్జెట్ అని అన్నారు.