- ఈనెల 17వరకు మీ సేవా కేంద్రాల్లో స్వీకరణ.
- ఇంటర్ లో గణితం నుంచి బీటెక్ సివిల్ వరకు అర్హత.
ముద్ర ప్రతినిధి, ఉమ్మడి రంగారెడ్డి: రెవెన్యూ పరిపాలనకు, సర్వే మరియు ల్యాండ్ రికార్డ్స్ విభాగం సహాయంగా, రాష్ట్రంలోని దాదాపు 5000 మంది లైసెన్స్ పొందిన సర్వేయర్లకు శిక్షణ ఇవ్వాలని యోచిస్తోందని రంగారెడ్డి జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి తెలిపారు.భూమికి సంబంధించిన సమస్యలను శాశ్వత ప్రాతిపదికన పరిష్కరించేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భూ భారతి (భూ హక్కుల రికార్డు) చట్టం-2025 ను ఏప్రిల్ 14న డాక్టర్ బి. ఆర్. అంబేద్కర్ జయంతి నాడు ప్రారంభించడం జరిగిందని గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. లైసెన్సుడు సర్వేయర్ల శిక్షణ కోసం అర్హత గల అభ్యర్థుల నుంచి తెలంగాణ అకాడమీ ఆఫ్ ల్యాండ్ ఇన్ఫర్మేషన్ అండ్ మేనేజ్మెంట్ (తాలిమ్) దరఖాస్తులను ఆహ్వానించిందని తెలిపారు.ఈ నెల 5వ తేదీ నుంచి రాష్ట్రంలోని అన్ని మీసేవా కేంద్రాల్లో రూ.100 చెల్లించి దరఖాస్తు, ప్రాస్పెక్టస్ పొందవచ్చని పేర్కొన్నారు.మీసేవా కేంద్రాల్లోనే ఈనెల 17వ తేదీ వరకు దరఖాస్తులు సమర్పించాలని తెలియజేశారు.ఇంటర్ లో గణితంతో 60% మార్కులు సాధించిన వారు, ఐటీఐ డ్రాఫ్ట్స్ మెన్ (సివిల్) డిప్లొమా (సివిల్), బీటెక్ (సివిల్) లేదా సమానమైన అర్హత గల వారు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు.ఎంపికైన అభ్యర్థులకు జిల్లా ప్రధాన కేంద్రాలలో ఈ నెల 26 నుండి జూలై 26 వరకు 50 పని దినాల్లో శిక్షణ ఇవ్వబడుతుందని తెలిపారు. ఇందుకు ఓసీ అభ్యర్థులు రూ.10 వేలు, బీసీ అభ్యర్థులు రూ.5 వేలు, ఎస్సీ, ఎస్టీ అభ్య ర్థులు రూ.2,500 ఫీజు చెల్లించాల్సి ఉంటుందని కలెక్టర్ నారాయణరెడ్డి పేర్కొన్నారు.