బస్వాపూర్ ప్రాజెక్టుకు 500 కోట్ల రూపాయలు కేటాయించి ప్రాజెక్టును పూర్తి చేయాలి : సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నర్సింహ
ముద్ర ప్రతినిధి, భువనగిరి :
బస్వాపురం ప్రాజెక్టును పూర్తి చేయడంలో, నిర్వాసితులకు నష్టపరిహారం చెల్లించడంలో రాష్ట్ర ప్రభుత్వానికి ఎందుకు ఇంత కక్ష ఉన్నదని, రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ బడ్జెట్ లో ప్రాజెక్టు కోసం ఒక్క రూపాయి కూడా కేటాయించకుండ వివక్షత చూపిందని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నర్సింహ విమర్శించారు. ఇప్పటికైనా ప్రాజెక్టు పూర్తి కోసం, నిర్వాసితుల నష్టపరిహారం కోసం తక్షణం 500 కోట్ల రూపాయలు కేటాయించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం భువనగిరి మండల పరిధిలోని ముత్తిరెడ్డిగూడెం గ్రామంలో సిపిఎం ఇంటింటి సమస్యల అధ్యయనంలో భాగంగా గ్రామంలోని గ్రామ సర్పంచ్ రాంపల్లి కృష్ణ, ఉప సర్పంచ్ అందే మల్లేశం, మాజీ సర్పంచ్ మాకొల్ల సత్యంకు కరపత్రం అందించారు. ప్రాజెక్టులో భూములు, ఇండ్లు కోల్పోతున్న రైతులు, ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క మాటలను నమ్మకుండా ప్రాజెక్టు పూర్తి సాయి నిర్మాణం కోసం, నిర్వాసితులకు రావలసిన నష్టపరిహారం కోసం పోరాటాలకు సిద్ధం కావాలని నర్సింహ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శివర్గ సభ్యులు కొండ అశోక్, శాఖ కార్యదర్శి కూకుట్ల కృష్ణ పాల్గొన్నారు.