Take a fresh look at your lifestyle.

ప్రభుత్వ లక్ష్యసాధనలో పోలీసుల పాత్ర కీలకం : డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

త్రీ ట్రిలియన్ డాలర్ ఎకానమీ సాధనలో పోలీసుల పాత్ర కీలకం 
పోలీస్ శాఖలో దశలవారీగా వినియోగంలో ఎలక్ట్రిక్ వాహనాలు
రాష్ట్ర సమగ్ర అభివృద్ధి కి రూరల్ అగ్రి రీజియన్ పై దృష్టి
ప్రీ బడ్జెట్ సమావేశాల్లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క 
ముద్ర, తెలంగాణ బ్యూరో : 
కాంగ్రెస్ పాలనలో తెలంగాణ 2047 నాటికి త్రీ ట్రిలియన్ డాలర్ ఎకానమీ సాధనే లక్ష్యంగా ముందుకు సాగుతోందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. ప్రభుత్వ ఈ లక్ష్యసాధనలో పోలీస్ శాఖ పాత్ర కీలకమని చెప్పారు. గురువారం రాష్ట్ర సచివాలయంలో మంత్రి శ్రీధర్ బాబుతో కలిసి హోంశాఖ, పరిశ్రమలు, ఐటీ శాఖల ప్రీ బడ్జెట్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం సంబంధిత అధికారులకు పలు సూచనలు చేశారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు పెద్ద సంఖ్యలో పెట్టుబడిదారులు వస్తున్న నేపథ్యంలో శాంతిభద్రతలు కీలకం అన్నారు. ఈ అంశంలో ఏ చిన్న పొరపాటుకు హోంశాఖ అధికారులు, సిబ్బంది అవకాశం ఇవ్వొద్దన్నారు. ప్రతి కదలిక పోలీసుల కను సన్నల్లో ఉండాలని  సూచించారు. విధుల నిర్వహణ క్రమంలో హోం శాఖకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి పూర్తి సహాయ సహకారాలు ఉంటాయని తెలిపారు. హైదరాబాద్ నగరం ప్రపంచంలో మేటి నగరంగా ఎదుగుతున్న క్రమంలో వేగంగా పలు సంస్కరణలు చేపడుతున్నామని చెప్పారు.

ఇందులో భాగంగా పోలీస్ శాఖలో దశలవారీగా ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని పెంచాలని సూచించారు. నేర నియంత్రణలో సీసీ కెమెరాల పాత్ర గణనీయంగా ఉంటుందన్న భట్టి.. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో సీసీ కెమెరాల వినియోగాన్ని పెద్ద సంఖ్యలో చేపట్టాలని ఆదేశించారు. అవసరమైన చోట మరమ్మతులు చేపట్టాలని చిన్న కదలికను సైతం వేను వెంటనే గుర్తించి నిఘాను పటిష్టం చేయాలన్నారు. అందుకు సీసీ కెమెరాల వినియోగాన్ని పెంచాలన్నారు. దానికి అవసరమైన సహకారాన్ని రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుందని తెలిపారు.
2047 త్రీ ట్రిలియన్ డాలర్ ఎకానమీగా లక్ష సాధనలో పబ్లిక్, ప్రైవేట్ మోడల్ అనివార్యమని భట్టి అభిప్రాయపడ్డారు. ఆ విధంగా ప్రణాళికలు సిద్ధం చేసుకుని ముందుకు వెళ్లాలని పరిశ్రమల శాఖ అధికారులకు సూచించారు. క్యూర్, ప్యూర్ తో పాటు రాష్ట్ర సమగ్ర అభివృద్ధికి రేర్ (రూరల్ అగ్రి రీజియన్ ఎకానమీ) సమ ప్రాధాన్యత ఇవ్వాలని డిప్యూటీ సీఎం సూచించారు. రేర్ రంగంలో పెద్ద ఎత్తున పెట్టుబడులు, పరిశ్రమలు వచ్చే విధంగా ప్రణాళికలు సిద్ధం చేయాలని పరిశ్రమల శాఖ అధికారులను ఆదేశించారు. మైక్రో, స్మాల్, మీడియం ఇండస్ట్రీల (ఎంఎస్ ఎంఈ) ను పెద్ద ఎత్తున ప్రోత్సహించాలనేది ప్రజా ప్రభుత్వం ఆలోచన అని తెలిపారు. ఎంఎస్ ఎంఈల ద్వారా రాష్ట్ర నలుమూలలోని యువతకు పెద్ద సంఖ్యలో ఉపాధి తో పాటు పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు అవకాశం ఉన్న రంగం ఎంఎస్ఎంఈ అన్నారు. 41 జీసీసీలతో రాష్ట్రం దేశంలోనే ప్రథమ స్థానంలో ఉందని గుర్తు చేశారు. ఇదే వేగాన్ని కొనసాగించేందుకు ప్రభుత్వ నుంచి ప్రోత్సాహం కల్పిస్తామని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుదిల్ల శ్రీధర్ బాబు అన్నారు. డాటా సెంటర్లలో ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ (ఏఐ) వినియోగాన్నిపెద్ద ఎత్తున చేపట్టాలని మంత్రి శ్రీధర్ బాబుకు సూచించారు. ఈ సమావేశంలో చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు, ఆర్థిక శాఖ ప్రధాన కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, హోం శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ సీవీ ఆనంద్,తెలంగాణ పారిశ్రామిక మౌలిక సదుపాయాలు సంస్థ ఎండి శశాంక డిప్యూటీ సీఎం స్పెషల్ సెక్రటరీ కృష్ణ భాస్కర్ పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.