ముద్ర ప్రతినిధి, నిర్మల్:
పట్టణంలోని సోఫీ నగర్ లో ఎస్టీ బాలికలపై అత్యాచారం చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని బీజేపీ రాష్ట్ర నేత రావుల రాం నాథ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు అత్యాచార బాధిత బాలికల కుటుంబ సభ్యులను ఆదివారం పరామర్శించారు. అనంతరం మాట్లాడుతూ నిర్మల్ జిల్లాలో హిందువులపై జరుగుతున్న వరుస దాడులు, అత్యాచారాలు సర్వ సాధారణం అయ్యాయన్నారు. పట్టణంలో హిందువులపై జరుగుతున్న దాడులకు నిరసనగా బీజేపీ ఆధ్వర్యంలో శనివారం పట్టణంలో బంద్ కొనసాగుతుండగానే సోఫీ నగర్ లో కొందరు మైనార్టీ వర్గానికి చెందిన దుండగులు మైనర్ బాలికలపై అత్యాచారానికి పాల్పడటం హేయమైన చర్యగా పేర్కొన్నారు. నిందితులకు కఠిన శిక్ష పడే విధంగా ఒత్తిడి తెస్తామని అన్నారు. ఇలాంటి ఘటనలు మళ్లీ పునరావృతం కాకుండా ఉండేలా నిందితులను శిక్షించాలని బీజేపీ నాయకులు పోలీసులకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు ఆకుల కార్తీక్, సుంకరి సాయి, పట్టణ బీజేపీ నాయకులు రాజు తో పాటు హిందూ సంఘాల నాయకులు, బీజేపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.