పోలీసులకు బిఆర్ఎస్ నాయకులకు మధ్య తోపులాట..
తీవ్ర ఉద్రిక్తత
ముద్ర ప్రతినిధి, భువనగిరి:
బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు సిట్ నోటీసులు ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ ఆదివారం యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని జగ్జీవన్ రామ్ చౌరస్తాలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించి సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం చేసి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా పోలీసులకు బిఆర్ఎస్ నాయకులకు మధ్య తోపులాట జరిగి తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. భువనగిరి మాజీ ఎమ్మెల్యే, నియోజకవర్గ ఇంచార్జ్ పైళ్ల శేఖర్ రెడ్డి మాట్లాడుతూ కెసిఆర్ కు ఉద్దేశ పూర్వకంగానే నోటీసులు పంపి విచారణ పేరుతో ఇబ్బందుల గురి చేస్తే సహించేది లేదన్నారు. సీఎం రేవంత్ రెడ్డి తగిన మూల్యం చెల్లించక తప్పదన్నారు. బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు కంచర్ల రామకృష్ణారెడ్డి కెసిఆర్ కు ప్రజలలో వస్తున్న ఆదరణ చూసి సిఎం రేవంత్ రెడ్డి కావాలని సిట్ పేరుతో నోటీసులు పంపి సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి చర్యలు మానుకోవాలని హెచ్చరించారు. పోలీసులు వారిని అరెస్టు చేశారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు ఎవి కిరణ్ కుమార్, ప్రధాన కార్యదర్శి రచ్చ శ్రీనివాస్ రెడ్డి, భువనగిరి మాజీ మున్సిపల్ చైర్మన్ ఎనబోయిన ఆంజనేయులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.