ముద్ర ప్రతినిధి, జగిత్యాల:
త్వరలో నిర్వహించే జనగణన కార్యక్రమంను విజయవంతంగా నిర్వహించాలని
జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ పేర్కొన్నారు. రాబోయే జనగణన–2027 కార్యక్రమంను విజయవంతంగా నిర్వహించేందుకు జగిత్యాల జిల్లాలో ఎంపికైన ఎన్యూమరేటర్లు, సూపర్వైజర్లకు శనివారం జగిత్యాల జిల్లా కేంద్రంలో నిర్వహించిన శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ శిక్షణ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ముఖ్యఅతిథిగా హాజరై పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ మాట్లాడుతూ జనగణన ప్రక్రియ దేశ అభివృద్ధికి కీలకమని, ఖచ్చితమైన గణాంకాలు సేకరించడం ద్వారా ప్రభుత్వ పథకాల రూపకల్పన, అమలు సులభమవుతుందని తెలిపారు. ఎన్యూమరేటర్లు, సూపర్వైజర్లు తమ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించాలని సూచించారు. శిక్షణలో భాగంగా ఇంటింటి వివరాల సేకరణ విధానం, డిజిటల్ పద్ధతుల్లో డేటా నమోదు, ప్రజలతో వ్యవహరించే తీరు, గోప్యత పరిరక్షణ వంటి అంశాలపై వివరంగా అవగాహన కల్పించారు. అలాగే ఫీల్డ్లో ఎదురయ్యే సమస్యలు, వాటి పరిష్కారాలపై మార్గదర్శకాలు అందించారు. జిల్లాలో జనగణన ప్రక్రియను సమయానికి పూర్తి చేయాలని, ప్రతి ఇంటి సమాచారం సరిగ్గా నమోదు చేయాలని అధికారులందరికీ సూచించారు. ప్రజల సహకారం లేకుండా జనగణన సాధ్యం కాదని, అందువల్ల ప్రజలు కూడా సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా స్థాయి అధికారులు, జగిత్యాల మున్సిపల్ కమిషనర్ స్పందన, జగిత్యాల రూరల్ తహసిల్దార్ హకీమ్, మరియు శిక్షకులు, ఎన్యూమరేటర్లు, సూపర్వైజర్లు మరియు సంబంధిత శాఖల ప్రతినిధులు పాల్గొన్నారు