ముద్ర ప్రతినిధి, భువనగిరి :
ప్రత్యేక సమగ్ర సవరణ దృష్ట్యా మ్యాపింగ్ ప్రక్రియ పకడ్బందీగా చేపట్టాలని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి అన్నారు.

మంగళవారం హైదరాబాద్ నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని జిల్లాల ఎన్నికల అధికారులు- కలెక్టర్లు, ఈ.ఆర్.ఓ., ఏ.ఈ.ఆర్.ఓ లతో ప్రత్యేక సమగ్ర సవరణకు ముందుగా చేపట్టిన మ్యాపింగ్ ప్రక్రియపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి మాట్లాడుతూ బూత్ స్థాయి అధికారులకు సహాయ సహకారాలు అందిస్తూ మ్యాపింగ్ ప్రక్రియ పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. బూత్ స్థాయి అధికారులు ఇంటింటికి తిరిగి మ్యాపింగ్ ప్రక్రియ పూర్తి చేయాలని, ఇందుకు గాను గ్రామ పాలన అధికారులు, ఇతర అధికారులను బూత్ స్థాయి అధికారులకు మ్యాపింగ్ లో సహాయకులుగా నియమించి మ్యాపింగ్ ప్రక్రియ త్వరగా పూర్తయ్యలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో మాట్లాడి వారి పార్టీ నుంచి బూత్ స్థాయి ఏజెంట్లను నియమించేలా అవగాహన కల్పించాలని తెలిపారు. బూత్ స్థాయి అధికారులు క్షేత్రస్థాయిలో తిరుగుతూ మ్యాపింగ్ ప్రక్రియ చేపట్టాలని, బూత్ స్థాయి అధికారుల పర్యవేక్షకులు, ఏ ఈ ఆర్ ఓ లు వారికి మ్యాపింగ్ చేయడంలో సహాయ సహకారాలు అందించి ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా జరిగేలా పకడ్బందీగా ప్రక్రియ చేయాలని తెలిపారు.బూత్ స్థాయి అధికారుల వివరాలు ప్రజలకు తెలిసేలా ప్రచారం నిర్వహించాలని, పెండింగ్ లో ఉన్న ఫారం 6, 7, 8 దరఖాస్తులను త్వరిత గతిన పరిష్కరించాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ హనుమంత రావు, భువనగిరి రెవిన్యూ డివిజనల్ అధికారి కృష్ణా రెడ్డి,తహసీల్దార్లు, ఎన్నికల అధికారులు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.