జిల్లాలో సదరం పెండింగ్ కేసులు లేకుండా త్వరితగతిన పూర్తిచేయాలి : వీడియో కాన్ఫరెన్స్ లో సెర్ఫ్ సిఈఓ దివ్య
ముద్ర ప్రతినిధి, భువనగిరి :
సదరం క్యాంపుల నిర్వహణపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సెర్ఫ్ సి ఈ ఓ దివ్య శనివారం సమీక్ష సమావేశం నిర్వహించారు.
జిల్లాలో సదరం పెండింగ్ కేసులు లేకుండా త్వరితగతిన పూర్తిచేయాలని, అలాగే యుడిఐడి దరఖాస్తులపై వేగవంతంగా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.

ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ భాస్కర్ రావు మాట్లాడుతూ జిల్లాలో సదరం సేవలను మరింత సమర్థవంతంగా అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా పెండింగ్ కేసులను త్వరితగతిన క్లియర్ చేయాలి. యుడిఐడి దరఖాస్తులు వచ్చిన వెంటనే సదరేంలో నమోదు చేయాలన్నారు. కొత్త దరఖాస్తులపై సమయానికి వికలాంగత సర్టిఫికేట్లు జారీ చేయాలి. రెన్యువల్ కేసులను త్వరితగతిన పరిష్కరించాలన్నారు. యుడిఐడి కార్డులను
లబ్ధిదారులకు పంపిణీ చేసి, సంబంధిత డేటాను నిరంతరం
పర్యవేక్షించాలన్నారు. డిజిటైజేషన్, సరెండర్ పోగొట్టుకున్న కార్డుల దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలన్నారు. NHC, PwD, SHGs సభ్యులలో UDID కార్డులు లేనివారికి వెంటనే జారీ చేయాలన్నారు.
ఈ సందర్భంగా నాగిరెడ్డి మాట్లాడుతూ డి ఆర్ డి ఏ నెలకు సంబంధించిన సదరం స్లాట్లు ఇప్పటికే విడుదలయ్యాయని తెలిపారు. లబ్ధిదారులు క్యాంపులకు సకాలంలో హాజరు కావడానికి వారికి ఫోన్ కాల్ ద్వారా ముందస్తుగా సమాచారమివ్వాలని సంబంధిత సిబ్బందిని ఆదేశించారు.
ఈ సమీక్ష సమావేశంలో డాక్టర్ కిరణ్, సుమన్, సదరం సిబ్బంది పాల్గొన్నారు.