మాదిగల పక్కనే నిలిచా.. ఒత్తిళ్లు వచ్చినా వెనక్కి తగ్గలేదు: మాదిగ ఎంప్లాయిస్ కో ఆర్డినేషన్ కమిటీ సన్మాన కార్యక్రమంలో సీఎం రేవంత్
నేను అందరివాడను
నన్ను ఎవరు ఎలా పిలిచినా పట్టించుకోను
పది మందికి సేవ చేయడానికే సీఎం అయ్యా
మహాభారతంలో కర్ణుడు, బార్బరీకుడి పాత్రలు నాకిష్టం
మిత్రధర్మానికి కట్టుబడి మాదిగల వెంట నిలబడ్డ
రాజకీయ ఒత్తిళ్లు వచ్చినా మాదిగల పక్కన నిలబడిన
నాపై జరుగుతోన్న దాడులకు మీ జాతి అండగా ఉండాలి
మాదిగ ఎంప్లాయిస్ కో ఆర్డినేషన్ కమిటీ సన్మాన కార్యక్రమంలో సీఎం రేవంత్

ముద్ర, తెలంగాణ బ్యూరో :
రాష్ట్రానికి సీఎంగా అన్ని వర్గాలకు తాను అందరి వాడినని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఎవరు ఏ పేరుతో పిలిచినా నాకు వచ్చిన ఇబ్బందేమీ లేదన్నారు. ఎస్సీ వర్గీకరణ చేసినప్పుడు రేవంత్ మాదిగ, బీసీలు రేవంత్ యాదవ్, వాకిటి శ్రీహరి కి మంత్రి పదవి ఇస్తే రేవంత్ ముదిరాజ్ అని, సిక్కులు సర్దార్ రేవంత్ అని అసదుద్దీన్ కు సాయం చేశానని రేవంతుద్దీన్ అని ప్రతిపక్షాలు నాపై సెటర్లు వేసి పైశాచికానందం పొందారన్నారు. అయినా వారి ఆరోపణలు, విమర్శలను తాను పట్టించుకోలేదని తేల్చి చెప్పారు. సీఎంగా వచ్చిన అవకాశాన్ని పది మంది కి సహాయం చేయడానికే అని భావిస్తున్నట్లు వెల్లడించారు. వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకుని మీ జాతికి చేయూత ఇచ్చినప్పుడే నాకు నిజమైన సంతోషం కల్గుతుందని చెప్పారు. మాదిగ ఎంప్లాయిస్ కో ఆర్డినేషన్ కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం హైదరాబాద్ లోని శిల్పకళావేదికలో సీఎం రేవంత్ రెడ్డికి సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఎస్సీ వర్గీకరణకు చట్టబద్దత కల్పించడంపై రేవంత్ రెడ్డికి మాదిగ సామాజికవర్గ ఉద్యోగులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. 2023 ఎన్నికల్లో కష్టపడి ప్రజా ప్రభుత్వాన్ని తెచ్చుకున్నారని అన్నారు. చిత్తశుద్ధితో ప్రజల ముందుకు వచ్చాం కాబట్టే ప్రజా ప్రభుత్వం ఏర్పడిందన్నారు. ఎస్సీ వర్గీకరణ కోసం మాదిగజాతి ఎంతో పోరాటం చేసిందని కొనియాడారు. ఈ పోరాటంలో అనేకమంది ప్రాణాలు కూడా కోల్పోయారని గుర్తుచేశారు. స్వయంగా తాను ఎన్నో ఏళ్లుగా వర్గీకరణ సమస్యను ప్రత్యక్ష్యంగా చూస్తూ వచ్చానని తెలిపారు. ఈ న్యాయమైన హక్కుపై మొదటినుంచి కూడా అనుకూలంగా ఉన్నట్లు చెప్పారు. ఈ సమస్యపై పోరాటం చేసినందుకు గతంలో తనను అసెంబ్లీ నుంచి గెంటేశారని తెలిపారు. ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా మీవైపే నిలబడ్డానని చెప్పారు. తనతో పాటు అనేకమంది వర్గీకరణ కోసం పోరాటం చేశారని చెప్పారు. సుప్రీంకోర్టు ఆదేశాల తర్వాత వర్గీకరణ కోసం ప్రకటన చేసిన తొలిరాష్ట్రం తెలంగాణేనని సీఎం వెల్లడించారు. వర్గీకరణ అంశంలో మాదిగల వైపు న్యాయం ఉందన్న సీఎం..ఇందులో నాకు ఎటువంటి అనుమానం లేదన్నారు. అందుకే చివరి వరకు మీకోసం స్టాండ్ తీసుకున్నానని వెల్లడించారు. ఇది ప్రజలు అందరూ కోరుకుంటే వచ్చిన ప్రభుత్వమని అన్నారు. అంతా సమిష్టిగా కష్టపడి బీఆర్ఎస్ను గద్దె దింపినట్లు చెప్పుకొచ్చారు. ముఖ్యంగా తాము మాటలతో కాడు.. కమిట్మెంట్తో గెలిచామని స్పష్టం చేశారు. ప్రగతి ప్రణాళికలో నిర్లక్ష్యంగా ఉండొద్దని సీఎం సూచించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు సంక్షేమ ఫలాలు అందించాలనేదే ప్రభుత్వ లక్ష్యమన్నారు. మీరు పన్నులు సక్రమంగా వసూలు చేసి ఖజానా నింపితే పేదలకు మేలు జరుగుతుందని చెప్పారు. . ప్రభుత్వ ప్రణాళికలను అమలు చేసేది మీరేనన్నారు. భవిష్యత్లో మీ హక్కులకు చట్టబద్ధత కల్పిస్తామని సీఎం హామీ ఇచ్చారు. గత ప్రభుత్వం గొర్రెలు, బర్రెలు, చేప పిల్లలు ఇచ్చిందన్నారు. కానీ, చెప్పులు కుట్టే ఈ జాతి ప్రజలు డాక్టర్లు, ఇంజినీర్లు, ఐఏఎస్లు, ఐపీఎస్లు కావాలన్నదే తన తాపత్రాయం అన్నారు.

విద్య కోసం ప్రత్యేక ప్రణాళికలు
పంచడానికి ప్రభుత్వం వద్ద భూములు లేవన్న సీఎం రేవంత్ రెడ్డి చదువు ఒక్కటే ప్రజలకు ఇవ్వగలిగే ఆస్తి అన్నారు. విద్య కోసం ప్రత్యేక ప్రణాళికలు రచిస్తున్నట్లు వివరించారు. రాష్ట్రంలోని ప్రతీ పేదవాడికి విద్యను దగ్గరచేయడానికే స్వయంగా తానే విద్యాశాఖ తీసుకున్నానని రేవంత్ రెడ్డి చెప్పారు. రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే విద్యాశాఖను ప్రక్షాళన చేశాం. బ్రేక్ ఫాస్ట్ స్కీమ్ తీసుకొచ్చాం.. బ్యాగులతో కూడిన కిట్ ఇవ్వబోతున్నాం.. హెల్తీ ఫుడ్ ఇస్తున్నాం. రాష్ట్రంలో పేదరికమనే కారణం చేత ఎవరూ విద్యకు దూరం కాకుండా చూడటమే తమ ప్రభుత్వ లక్ష్యమని సీఎం చెప్పుకొచ్చారు. మహాభారతంలో తనకు ఇష్టమైన పాత్ర కర్ణుడు, బర్బరీకుడిది అని సీఎం చెప్పారు. కర్ణుడి మాదిరిగా మాదిగల విషయంలో మిత్రధర్మం పాటిస్తున్నట్లు వివరించారు. బర్బరీకుడు బలహీన పక్షాల వైపు నిలబడ్డ వ్యక్తి అనీ అందుకే మాదిగల విషయంలో వర్గీకరణ కోసం బర్బరీకుడిలా పనిచేశానని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక పథకాలు అమలు చేస్తున్నామన్నారు. ఈ సమావేశంలో మంత్రులు దామోదర్ రాజనర్సింహా, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పాల్గొన్నారు.
