ముద్ర ప్రతినిధి, నిర్మల్:
జిల్లాలో ధాన్యం నిల్వ కోసం మరిన్ని స్థలాలు సమకూర్చుకోవాలని కలెక్టర్ భవేశ్ మిశ్రా అధికారులను ఆదేశించారు.ధాన్యం కొనుగోలు, నిల్వ ప్రక్రియపై సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష సమావేశం మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యం వెంట వెంటనే గోదాములకు తరలించాలన్నారు. ముందు జాగ్రత్త చర్యగా అదనపు ధాన్యం నిల్వ చేసేందుకు స్థలం సమకూర్చు కోవాలన్నారు. ఇతర జిల్లాల్లో గోదాములు అందుబాటులో ఉంటే, ఆ ప్రదేశాలు గుర్తించి ధాన్యం అక్కడికి తరలించాలన్నారు. ధాన్యం నిరంతరాయంగా తరలింపునకు అనుగుణంగా తగినన్ని లారీలు, తగినంత మంది హమాలీలు అందుబాటులో ఉండాలని తెలిపారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్లు బి. వెంకటేశ్వర్లు, కిషోర్ కుమార్, ఆర్డీఓ రత్నకళ్యాణి, పౌర సరఫరాల అధికారులు రాజేందర్, సుధాకర్, డిఎం మార్క్ ఫెడ్ మహేష్, డిఆర్డిఓ విజయలక్ష్మి, జడ్పీ సీఈవో భాగ్యలక్ష్మి, డిపిఓ శ్రీనివాస్, ఇతర అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.