ముద్ర ప్రతినిధి, నిర్మల్:
జనగణన ప్రక్రియలో భాగమైన ఇళ్ల గుర్తింపు ప్రక్రియను పకడ్బందీగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా అధికారులను ఆదేశించారు. నిర్మల్ గ్రామీణ మండలం తల్వేద లో జనగణన హౌస్ లిస్టింగ్ ప్రక్రియ తీరును కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ హౌస్ లిస్టింగ్ ప్రక్రియకు సంబంధించి వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. జనగణన ప్రక్రియలో ఇండ్ల గణన అనేది అత్యంత కీలకమని అన్నారు. నిర్ణీత గడువులోగా హౌస్ లిస్టింగ్ ప్రక్రియను ఎటువంటి పొరపాట్లు లేకుండా పూర్తి చేయాలని వివరించారు. నిబంధనల ప్రకారం జనగణనకు సంబంధించి ఇంటి నంబర్లను కేటాయించాలని చెప్పారు. స్థానిక పంచాయతీ కార్యదర్శి, జిపిఓ లు జనగణన అధికారుల వెంబడి ఉండాలని పేర్కొన్నారు. జనగణన అధికారులకు అందించిన ఎన్యుమరేషన్ కిట్ లను పరిశీలించారు.ఎండలు అధికంగా ఉన్నందున జాగ్రత్తలు తీసుకుంటూ హౌస్ లిస్టింగ్ ప్రక్రియను పూర్తి చేయాలన్నారు. ప్రజలతో మాట్లాడుతూ జనగణన ప్రక్రియలో ప్రజలందరూ భాగస్వామ్యం కావాలన్నారు. అధికారులు అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్పి వారికి సహకరించాలని కోరారు.ఈ కార్యక్రమంలో సిపిఓ జీవరత్నం, తహసిల్దార్ ప్రభాకర్, సర్పంచ్ లక్ష్మి, జనగణన అధికారులు, ఇతర అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
ప్రచార వాహనం ప్రారంభం
అంతకు ముందు జనగణన ప్రచార వాహనాన్ని ఆయన జండా ఊపి ప్రారంభించారు. ఈ క్రమంలో మాట్లాడుతూ వచ్చే నెల 9 వరకు జరిగే ఈ ప్రక్రియలో జిల్లాలో 200 మంది సూపర్వైజర్లు, 1400 మంది ఎన్యూమరేటర్లు పని చేస్తున్నారన్నారు. ఇప్పటి వరకు 20 వేలకు పైగా ఇళ్ల గణన ఆన్లైన్ లో పూర్తి అయిందన్నారు.