గడపగడపకు వెళ్లి ఓటును కోరిన బీర్ల అయిలయ్య, మోత్కుపల్లి నర్సిహులు నెలికంటి సత్యం..
ముద్ర ప్రతినిధి, భువనగిరి :
యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట పట్టణంలోని 3వ వార్డు, 2వ వార్డు, 12వ వార్డుల్లో రాష్ట్ర ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య మున్సిపల్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు, ఎమ్మెల్సీ నెలికంటి సత్యం పాల్గొని ప్రచారాన్ని ఉత్సాహపరిచారు.
ఈ సందర్భంగా వారు గడపగడపకు తిరుగుతూ ప్రజలను కలిసి, కాంగ్రెస్ పార్టీ చేయి గుర్తుకు ఓటు వేసి పార్టీ అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. అలాగే 12వ వార్డులో సీపీఐ అభ్యర్థి కంకి కొడవలి గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.

అనంతరం యాదగిరిగుట్టలోని ప్రభుత్వ విప్ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బీర్ల అయిలయ్య మాట్లాడుతూ ప్రజల సంక్షేమమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తోందని అన్నారు. గత ప్రభుత్వ హయాంలో ప్రజలు ఎదుర్కొన్న ఇబ్బందులను గుర్తు చేస్తూ, ప్రస్తుతం అమలవుతున్న సంక్షేమ పథకాలు పేదలు, బడుగు బలహీన వర్గాలకు ఎంతో ఉపయోగపడుతున్నాయని తెలిపారు. యాదగిరిగుట్ట పట్టణ అభివృద్ధికి కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక దృష్టి సారించిందని, రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో పాటు మిత్రపక్షమైన సీపీఐ అభ్యర్థులు ఘన విజయం సాధిస్తారని ధీమా వ్యక్తం చేశారు. ప్రజలంతా ప్రజాస్వామ్య పండుగలో భాగస్వాములై సరైన నిర్ణయం తీసుకోవాలని ఆయన కోరారు.
