10వ వార్డులో స్వతంత్ర అభ్యర్థి ఇమ్రాన్కు మద్దతుగా ప్రచారంలో పాల్గొన్న సిపిఐ ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం..
ముద్ర ప్రతినిధి, భువనగిరి :
భువనగిరి పట్టణంలోని 10వ వార్డులో జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో సిపిఐ ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం గడపగడపకు తిరుగుతూ ఓటర్లను సిలిండర్ గుర్తుపై ఓట్లేసి అభ్యర్థించారు. బీఆర్ఎస్, సిపిఐ, సిపిఎం మద్దతుతో పోటీ చేస్తున్న స్వతంత్ర అభ్యర్థి ఎండీ ఇమ్రాన్కు పూర్తి మద్దతు ప్రకటించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం మాట్లాడుతూ, ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడుతున్న వ్యక్తి ఇమ్రాన్ అని, కార్మికులు, పేదలు, మధ్యతరగతి వర్గాల అభ్యున్నతే లక్ష్యంగా పనిచేసే నాయకుడిగా ఆయనకు మంచి గుర్తింపు ఉందన్నారు. పదో వార్డులో మౌలిక వసతుల అభివృద్ధి, తాగునీరు, డ్రైనేజీ, రోడ్లు, పారిశుధ్యం వంటి సమస్యల పరిష్కారానికి ఇమ్రాన్ విజయం అత్యంత అవసరమని తెలిపారు.
ప్రజాస్వామ్య విలువలను కాపాడుతూ ప్రజల పక్షాన నిలబడే అభ్యర్థిని గెలిపించాల్సిన బాధ్యత ప్రతి ఓటరుపై ఉందని ఆయన పిలుపునిచ్చారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో పదో వార్డులో ఇమ్రాన్ను భారీ మెజారిటీతో గెలిపించాలని ఆయన ఓటర్లను విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి యానాల దామోదర్ రెడ్డి బాలగాని సత్యనారాయణ, ఏఐటీయూసీ జిల్లా నాయకులు సామల శోభన్ బాబు, సామల భాస్కర్ నాయకులు గాదెగాని మాణిక్యం చింతల మల్లేష్ బద్దం వెంకట్ రెడ్డి షర్పోద్దిన్ సతీష్ అదిల్ ఇర్ఫాన్ రిజ్వాన్ వార్డు మహిళలు అధిక సంఖ్యలో హాజరయ్యారు.