ముద్ర, శేరిలింగంపల్లి:
సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో వీకెండ్ స్పెషల్ డ్రంక్ అండ్ డ్రైవ్ లో భాగంగా సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు విస్తృతంగా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపట్టారని సైబరాబాద్ ట్రాఫిక్ డిసిపి రంజన్ రతన్ కుమార్ తెలిపారు.
ఈ డ్రైవ్లో భాగంగా మొత్తం 196 మందిని అదుపులోకి తీసుకొని కేసులు నమోదు చేశామన్నారు. వీరిలో 140 ద్విచక్ర వాహనదారులు, 13 ఆటోలు, 41 కార్లు, రెండు హెవీ వాహనదారులపై కేసులు నమోదయ్యాయని వివరించారు.
బ్లడ్ ఆల్కహాల్ కాన్సన్ట్రేషన్ (బిఎసి) ఆధారంగా కేసులను వర్గీకరిస్తే —157 మంది 36 ఎంజీ 100 ఎంఎల్ నుంచి 200 ఎం జీ 100 ఎంఎల్ మధ్య, 26 మంది 201 ఎంజీ 100 ఎంఎల్ నుంచి 300 ఎం జీ/100 ఎంఎల్ మధ్య, 13 మంది 301 ఎంజీ 100 ఎంఎల్ నుంచి 550 ఎంజీ 100 ఎంఎల్ మధ్య ఆల్కహాల్ సేవించి పట్టుబడ్డారు. వీరందరినీ చట్టపరమైన చర్యల కోసం కోర్టుకు హాజరుపర్చనున్నట్లు ఆయన తెలిపారు. మద్యం సేవించి డ్రైవింగ్ చేయటం తీవ్రమైన నేరమని డీసీపీ పునరుద్ఘాటించారు. మద్యం మత్తులో వాహనం నడిపి ప్రమాదానికి కారణమైతే, భారతీయ న్యాయ సంహిత –2023లోని సెక్షన్ 105 (కల్పబుల్ హోమిసైడ్ నాట్ అమౌంటింగ్ టు మర్డర్) కింద కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఈ నేరానికి గరిష్ట శిక్ష 10 ఏళ్ల జైలు, జరిమానా విధించే అవకాశం ఉందని పేర్కొన్నారు. గత వారం లో మొత్తం 212 డ్రంక్ డ్రైవింగ్ కేసులను కోర్టులు పరిష్కరించాయన్నారు. వీరిలో జైలు ఆరుగురికి జరిమానా, సోషల్ సర్వీస్, 206మందికి జరిమానా విధించినట్లు తెలిపారు.