- అడవులు లేకపోతే వినాశనం.. మానవ మనుగడ కష్టం
- రాష్ట్ర దేవాదాయ, అటవీశాఖ మంత్రి కొండా సురేఖ
- నందిగామ మండలం కన్హలో జాతీయ జీవ వైవిధ్య యువజన సదస్సును ప్రారంభించిన మంత్రి కొండా సురేఖ
ముద్ర ప్రతినిధి, ఉమ్మడి రంగారెడ్డి: పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యతని తెలంగాణ రాష్ట్ర దేవాదాయ, అటవీశాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. ప్రతి ఒక్కరూ విధిగా మొక్కలు నాటి వాటినీ సంరక్షించాలని పిలుపునిచ్చారు. గురువారం రంగారెడ్డి జిల్లా నందిగామ మండలం కన్హ శాంతివనంలో నిర్వహించిన జాతీయ జీవ వైవిధ్య యువజన సదస్సును మంత్రి కొండా సురేఖ ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ.. పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ మొక్కలను నాటి సంరక్షించాలని పిలుపునిచ్చారు. ఎక్కడికక్కడ ఇష్టానుసారంగా చెట్లను నరికి వేస్తుండడంతో కాలుష్యం పెరిగిపోతోందన్నారు. ఉష్ణోగ్రతలలో అనేక మార్పులు వస్తున్నాయని, ఇది వినాశనానికి దారితీస్తుందన్నారు. పర్యావరణాన్ని కాపాడేందుకు ప్రభుత్వ అనేక కార్యక్రమాలను చేపడుతోందని తెలిపారు. విద్యార్థులకు చిన్న వయసు నుంచే పర్యావరణం పై అవగాహన పెంచాల్సిన అవసరం ఉందని చెప్పారు. పర్యావరణ పరిరక్షణ కోసం యువత ముందడుగు వేయాల్సిన అవసరం ఎంతో ఉందన్నారు. ఈ కార్యక్రమంలో జాతీయ జీవవైవిద్య చైర్ పర్సన్ అచలేదర్ రెడ్డి, తెలంగాణ రాష్ట్ర జీవ వైవిధ్య బోర్డు కార్యదర్శి కలిచరన్, దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన 70 విద్యార్థులు పాల్గొన్నారు. ఈ జాతీయ జీవ వైవిధ్య సదస్సు మూడు రోజులపాటు జరగనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
