కట్టుదిట్టమైన పోలీసు భద్రత మధ్య పదవ తరగతి పరీక్షలు * పరీక్షా కేంద్రాలను స్వయంగా పరిశీలించిన జిల్లా ఎస్పీ టి. శ్రీనివాసరావు
ముద్ర,జోగుళాంబ గద్వాల ప్రతినిధి:
పదవ తరగతి వార్షిక పరీక్షలు జరుగుతున్న సందర్భంగా బుధవారం గద్వాల్ జిల్లా కేంద్రంలోని సరస్వతి టాలెంట్ హై స్కూల్ పరీక్షా కేంద్రాన్ని జిల్లా ఎస్పీ టి. శ్రీనివాసరావు స్వయంగా సందర్శించి, అక్కడి ఏర్పాట్లు మరియు భద్రతా చర్యలను సమగ్రంగా పరిశీలించారు.
ఈ సందర్భంగా పరీక్షా కేంద్రాల వద్ద ఏర్పాటు చేసిన పోలీసు బందోబస్తును ఎస్పీ తనిఖీ చేసి, పరీక్షలు పూర్తిగా ప్రశాంత వాతావరణంలో, ఎటువంటి అంతరాయం లేకుండా సజావుగా నిర్వహించేందుకు అన్ని విధాల చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.
పరీక్షా కేంద్రాల పరిసర ప్రాంతాల్లో 163 BNS సెక్షన్ కచ్చితంగా అమల్లో ఉండేలా చూడాలని, అనవసరంగా గుమిగూడే వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. విద్యార్థుల భద్రతకు ఎటువంటి విఘాతం కలగకుండా, ప్రతి కేంద్రం వద్ద కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.
అలాగే పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా, ట్రాఫిక్ నియంత్రణతో పాటు అవసరమైన సహాయ సహకారాలు అందించాలని పోలీసు సిబ్బందికి సూచించారు.
విద్యార్థులు ప్రశాంతంగా పరీక్షలు రాసి, ఉత్తమ ఫలితాలు సాధించాలని జిల్లా ఎస్పీ గారు ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో గద్వాల్ సర్కిల్ ఆఫీసర్ టంగుటూరి శ్రీను, గద్వాల్ పట్టణ ఎస్సై -2 సతీష్ కుమార్ రెడ్డి సిబ్బంది పాల్గొన్నారు.