వచ్చే ఆర్ధిక సంవత్సరానికి కేటాయింపులు
ప్రకటించిన మేయర్ విజయలక్ష్మీ
ముద్ర, హైదరాబాద్ :
మహానగర అభివృద్ధే లక్ష్యంగా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ 2026-27 ఆర్థిక సంవత్సరానికి భారీ బడ్జెట్ ప్రవేశపెట్టింది. శనివారం మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అధ్యక్షతన స్టాండింగ్ కమిటీ సమావేశం జరిగింది. ఇందులో కమిటీ రూ.11,460 కోట్ల బడ్జెట్ ముసాయిదాకు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. గతేడాది బడ్జెట్ కంటే ఈసారి కేటాయింపులు గణనీయంగా పెరిగాయి. ముఖ్యంగా విలీన మున్సిపాలిటీల అభివృద్ధి, రోడ్ల విస్తరణ, పారిశుధ్య నిర్వహణపై ఈ బడ్జెట్లో ప్రాధన్యతను ఇచ్చారు. పాత జీహెచ్ఎంసీ పరిధిలో మున్సిపాలిటీలకు రూ.9,200 కోట్లు, కొత్తగా విలీనం అయిన 27 మున్సిపాలిటీలకు రూ.2,260 కోట్లు కేటాయించారు. ఇందులో నగరంలో పెరిగిన ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి, కొత్త ఫ్లైఓవర్లు, రోడ్ల నిర్వహణ కోసం రూ.1,720 కోట్లు ఖర్చు చేయనున్నారు. నగరంలో పచ్చదనాన్ని పెంచేందుకు రూ.590 కోట్లతో ప్రత్యేక కార్యాచరణ రూపొందించారు. భారీ వర్షాల కారణంగా ముంపు ప్రాంతాల్లో సమస్య తలెత్తకుండా స్ట్రాటజిక్ నాలా డెవలప్మెంట్ ప్లాన్ కింద రూ.550 కోట్లు కేటాయించారు. బడ్జెట్కు కేటాయించిన మొత్తం సొమ్మును ఆస్తి పన్ను, టౌన్ ప్లానింగ్ ఫీజులు, ప్రభుత్వ గ్రాంట్ల ద్వారా సమకూర్చనున్నారు.