‘మహా’నగరం
మూడు కార్పొరేషన్లు…. ఆరు జోన్లు
ఓఆర్ఆర్ పరిధిలోని 27 మున్సిపాలిటీలు, నగర పంచాయతీలు జీహెచ్ఎంసీలో విలీనం
300 డివిజన్లతో దేశంలోనే అతిపెద్ద మహానగరంగా గ్రేటర్ సిటీ
జీహెచ్ఎంసీ యధాతథం..
కొత్తగా మల్కాజిగిరి, సైబరాబాద్ కార్పొరేషన్లు
ఈ నెల 10న ముగిసిన ప్రస్తుత పాలకమండలి పదవీ కాలం
తాజాగా మూడు కార్పొరేషన్లుగా జీహెచ్ఎంసీ
పాత జీహెచ్ఎంసీలో దాదాపు కోటి మంది జనాభా
27 మున్సిపాలిటీల్లో 34లక్షల మంది
నగరంలో 17 ఏళ్ల తర్వాత ప్రత్యేక అధికారి పాలన
ముద్ర, తెలంగాణ బ్యూరో :
గ్రేటర్ హైదరాబాద్… మూడు కార్పొరేషన్లు…. ఆరు జోన్లు.. మూడొందల డిజవిన్లతో దేశంలోనే అతిపెద్ద కార్పొరేషన్, మహనగరంగా అవతరించింది. నగర శివార్లలో పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా మౌలిక సదుపాయాల కల్పన, మెరుగైన రవాణా సౌకర్యాలు, ఏకీకృత అభివృద్ధి లక్ష్యంగా కాంగ్రెస్ సర్కార్ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ)ను మూడు భాగాలు విభజించాలని నిర్ణయం తీసుకోవడంతో పాటు దాన్ని అమలు చేసింది. ఇటీవల హైదరాబాద్ చుట్టూ ఔటర్ రింగు రోడ్డు పరిధిలోని 27 మున్సిపాలిటీలు, నగర పంచాయతీలను విలీనం చేసిన ప్రభుత్వం.. మొత్తం మూడొందల డివిజన్లు (జీహెచ్ఎంసీ తో కలిపి) ఏర్పాటు చేసింది. తద్వార మహానగర పాలక సంస్థ పరిధిని మరింత విస్తరింపజేసింది. ప్రభుత్వ తాజా నిర్ణయంతో హైదరాబాద్లో గ్రేటర్ కార్పొరేషన్ ఒక్కటే ఉండనుంది. ప్రస్తుతం మూడొందల డివిజన్లతో దేశంలోనే అతి పెద్ద మహానగరంగా విస్తరించిన జీహెచ్ఎంసీని మూడు కార్పొరేషన్లుగా విభజిస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. జీహెచ్ఎంసీతో పాటు సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (సీఎంసీ), మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ (ఎంఎంసీ)గా విభజిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. జీహెచ్ఎంసీలో శంషాబాద్, రాజేంద్రనగర్, గోల్కొండ, సికింద్రాబాద్, చార్మినార్, ఖైరతాబాద్ జోన్లు, మల్కాజిగిరి కార్పొరేషన్లో మల్కాజిగిరి, ఉప్పల్, ఎల్బీనగర్ జోన్లు, సైబరాబాద్ కార్పొరేషన్లో కూకట్పల్లి, శేరిలింగంపల్లి, కుత్బుల్లాపూర్ జోన్లు ఖరారు చేసింది.
మారిన స్వరూపం
ఇప్పటి వరకు జీహెచ్ఎంసీ 6 జోన్లుగా, 30 సర్కిళ్ళుగా, 150 వార్డులుగా విభజింపబడింది. ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయంతో.. 12 జోన్లు, 60 సర్కిళ్లు, 300 డివిజన్లతో అతిపెద్ద నగరపాలక సంస్థగా ఏర్పాటైంది. ప్రస్తుత జీహెచ్ఎంసీని ప్రభుత్వం 70 లక్షల జనాభాతో కూడిన ఆరు జోన్లకు పరిమితం చేశారు. సగటున 35లక్షల జనాభా ఉండేలా జీహెచ్ఎంసీతో పాటు మల్కాజిగిరి, సైబరాబాద్ కార్పొరేషన్లను మూడు జోన్ల చొప్పున ఏర్పాటు చేసింది. పాత జీహెచ్ఎంసీలో దాదాపు కోటి మంది జనాభా ఉండేది. 27 మున్సిపాలిటీల విలీనం తర్వాత 1.34కోట్ల మంది జనాభా ఉంది. గతంలో 150 డివిజన్లు ఉండగా.. డివిజన్ల పునర్విభజనలో అవి ప్రస్తుతం 300కు పెరిగాయి. పాత హైదరాబాద్ నగరంలో జనాభా అధికంగా ఉన్నందున.. డివిజన్ల సంఖ్య దాదాపు రెట్టింపయింది. గ్రేటర్ హైదరాబాద్లో విలీనమైన 27 పట్టణ స్థానిక సంస్థల పరిధిలో జనాభా అంతంతమాత్రంగానే ఉంది.
17 ఏళ్ల తర్వాత ప్రత్యేక పాలన
గ్రేటర్ నగరంలో 17 ఏళ్ల తర్వాత ప్రత్యేక అధికారి పాలన రాబోతున్నది. ఈనెల10తో ప్రస్తుత పాలకమండలి పదవీ కాలం కూడా ముగిసింది. ఎన్నికలు జరిగే వరకు స్పెషల్ ఆఫీసర్ పాలన సాగనుంది. దీంతో జీహెచ్ఎంసీ మరోసారి ప్రత్యేక అధికారి పాలనలోకి వెళ్లింది. పాలక మండలి పదవీ కాలం అయిపోతే.. మేయర్కు సమాన హోదాలో ప్రభుత్వం స్థానిక సంస్థలకు స్పెషల్ ఆఫీసర్లను నియమించి పరిపాలనను కొనసాగిస్తుంది. చివరి సారిగా 2008 సెప్టెంబరు 4 నుంచి 2009 డిసెంబరు 4 వరకు ఎస్.పి.సింగ్ జీహెచ్ఎంసీ కమిషనర్, ప్రత్యేక అధికారి హోదాలో పరిపాలన చేపట్టారు.
జోన్లు వాటి పరిధిలో సర్కిళ్లు
శంషాబాద్ : ఆదిభట్ల, బడంగ్పేట్, జల్పల్లి, శంషాబాద్
చార్మినార్ : సంతోష్ నగర్, యాకత్పురా, మలక్పేట, చార్మినార్, మూసారాంబాగ్.
ఖైరతాబాద్ : ఖైరతాబాద్, జూబ్లీహిల్స్, బోరబండ, యూసుఫ్గూడ, అమీర్పేట
రాజేంద్రనగర్ : రాజేంద్రనగర్, అత్తాపూర్, బహదూర్పుర, ఫలక్నుమా, చాంద్రాయణగుట్ట, జంగమ్మెట్
గోల్కొండ : గోషామహల్, కార్వాన్, గోల్కొండ, మెహిదీపట్నం, మాసాబ్ ట్యాంక్
సికింద్రాబాద్ : కవాడిగూడ, ముషీరాబాద్, అంబర్పేట్, తార్నాక, మెట్టుగూడ