ముద్ర, శేరిలింగంపల్లి:
హోంగార్డు సభ్యుల సంక్షేమమే సొసైటీ లక్ష్యమని సైబరాబాద్ అడ్మిన్ డీసీపీ అన్నపూర్ణ అన్నారు. సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని హోం గార్డ్స్ కో-ఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ లిమిటెడ్ మొదటి జనరల్ బాడీ మీటింగ్ మంగళవారం సైబరాబాద్ సీపీ ఆఫీస్ ఆడిటోరియం లో నిర్వహించారు.ఈ సమావేశంలో సొసైటీ కార్యకలాపాలు, సభ్యుల సంక్షేమం, భవిష్యత్ ప్రణాళికలు మరియు ఆర్థిక వ్యవహారాలపై చర్చించి కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
అడ్మిన్ డీసీపీ టి.అన్నపూర్ణ ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలోని మొట్టమొదటగా ఏర్పాటు చేసిన సైబరాబాద్ హోం గార్డ్స్ కో-ఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ మంచి స్థాయిలో పనిచేస్తోందన్నారు. సభ్యులకు అన్ని విషయాలను పారదర్శకంగా తెలియజేయాలనే ఉద్దేశంతోనే ఈ సమావేశం నిర్వహించామని చెప్పారు. సొసైటీకి సభ్యుల నుంచి మంచి సహకారం లభిస్తోందని, ఇదే విధంగా కొనసాగించాలని సూచించారు. సభ్యుల సంక్షేమానికి ఉపయోగపడే కార్యక్రమాలు చేపట్టి, అవసరమైన తీర్మానాలను అమలు చేస్తామని అన్నపూర్ణ తెలిపారు. సైబరాబాద్ సీపీ డాక్టర్ ఎం. రమేష్ సహకారంతో సొసైటీ విజయవంతంగా నడుస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో సైబరాబాద్ కోపరేటివ్ సొసైటీ ఇంచార్జి ఎస్సై మల్లేశం తీర్మానాలు ప్రవేశపెట్టగా సీఏఆర్ హెడ్క్వార్టర్స్ డీసీపీ సంజీవ్, అడ్మిన్ ఏడీసీపీ ఎఫ్. రెహమాన్, సీఏఆర్ హెడ్క్వార్టర్స్ ఏడీసీపీ షమీర్, హోంగార్డ్స్ వెల్ఫేర్ ఆర్ఐ విజయానంద్, సైబరాబాద్ కోపరేటివ్ సొసైటీ ఇంచార్జి ఎస్సై మల్లేశం తదితరులు పాల్గొన్నారు.