ఇందిరమ్మ భీమాతో ప్రభుత్వానికి ప్రత్యేక గుర్తింపు రాజీవ్ గాంధీ పంచాయతీ రాజ్ సంఘటన్ జాతీయ కన్వీనర్ మహేందర్ రెడ్డి
ముద్ర ప్రతినిధి, మెదక్:
ఇందిరమ్మ కుటుంబ జీవిత భీమా పథకంను ప్రవేశపెట్టి రాష్ట్రంలోని సుమారు 1.15 కోట్ల కుటుంబాలకు భద్రత కల్పించడం కాంగ్రెస్ ప్రభుత్వ దూరదృష్టిని ప్రతిబింబిస్తుందని రాజీవ్ గాంధీ పంచాయతీ రాజ్ సంఘటన్
జాతీయ కన్వీనర్ మహేందర్ రెడ్డి పేర్కొన్నారు. దేశంలోనే ప్రత్యేకంగా పేద, ధనిక తేడా లేకుండా ప్రతి కుటుంబానికి రూ. 5 లక్షల భీమా అందించడం ద్వారా అనుకోని పరిస్థితుల్లో కుటుంబాలకు ఆర్థిక రక్షణ కల్పించబడుతుందన్నారు.
రాష్ట్ర అభివృద్ధికి పునాది అయిన విద్యారంగానికి కాంగ్రెస్ ప్రభుత్వం అత్యున్నత ప్రాధాన్యత ఇస్తూ ఈ ఏడాది బడ్జెట్లో రూ. 26,674 కోట్లు కేటాయించడం అభినందనీయం అన్నారు. ఈ నిర్ణయం ద్వారా ప్రభుత్వ పాఠశాలల మౌలిక వసతుల అభివృద్ధి, ఉపాధ్యాయుల నియామకాలు, ఆధునిక సదుపాయాల విస్తరణ వేగవంతం అవుతాయి. పేద, మధ్యతరగతి కుటుంబాల పిల్లలకు నాణ్యమైన విద్య అందించే దిశగా ఇది ఒక కీలకమైన అడుగు అవుతుందన్నారు.