ముద్ర కాప్రా
మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో పారిశుద్ధ్య పనుల్లో ఎలాంటి నిర్లక్ష్యాన్ని ఉపేక్షించబోమని అదనపు కమిషనర్ (శానిటేషన్) రఘు ప్రసాద్ సిబ్బందిని హెచ్చరించారు. కాప్రా సర్కిల్లోని పలు ప్రాంతాలను ఆయన సందర్శించి పారిశుద్ధ్య నిర్వహణపై సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా స్వచ్ఛ ఆటోల పనితీరును పరిశీలించిన ఆయన, చెత్త తరలింపు సమయంలో ఆటోలపై తార్పాలిన్ కప్పకుండా తీసుకెళ్లడం వల్ల రోడ్లపై చెత్త పడుతూ దుర్వాసన వ్యాపించే ప్రమాదం ఉందని గుర్తించారు. ఈ సమస్యను నివారించేందుకు రాంకీ సంస్థ ద్వారా ప్రతి ఆటోకు తార్పాలిన్ అందించేలా తక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు.
అదేవిధంగా సాకేత్ ట్రాన్స్ఫర్ స్టేషన్లో చెత్త డంపింగ్ మరియు తరలింపు ప్రక్రియను ప్రత్యక్షంగా తనిఖీ చేసి సంబంధిత అధికారులకు సూచనలు చేశారు. వంపుగూడ కాలనీలో దోమల నివారణ చర్యలను పరిశీలిస్తూ, మురికికుంటల్లో లార్వా అభివృద్ధిని అరికట్టేందుకు తీసుకుంటున్న చర్యలను సమీక్షించారు. ఈ క్రమంలో మురికినీటి గుంటల్లో క్రిమిసంహారకాలను చల్లించి దోమల పెరుగుదలను నియంత్రించే చర్యలు చేపట్టారు.
ఈ కార్యక్రమంలో కాప్రా సర్కిల్ డిప్యూటీ కమిషనర్ శ్రీహరి, ఏఈ ఎంటమాలజీ రమేష్, సానిటరీ సూపర్వైజర్లు సుదర్శన్, జవాన్ రామకృష్ణ, శ్రీనివాస్, సర్కిల్ ఇంచార్జ్ నవీన్ కుమార్ రెడ్డి, సూపర్వైజర్ రాంబాబు తదితరులు పాల్గొన్నారు.