ముద్ర ప్రతినిధి నాగర్ కర్నూల్
నాగర్ కర్నూల్ నియోజకవర్గ పరిధిలోని పెద్దూరు ప్రాథమిక వ్యవసాయ సహకార కేంద్రం, తెల్కపల్లి మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో కొనసాగుతున్న మొక్కజొన్న కొనుగోలు ప్రక్రియను జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ మంగళవారం సాయంత్రం ఆకస్మికంగా పరిశీలించారు.
ఈ సందర్భంగా రైతులు విక్రయానికి తీసుకొచ్చిన మొక్కజొన్న ధాన్యాన్ని పరిశీలించిన కలెక్టర్, తేమ శాతం నిర్ధారణ, తూకం విధానం, నిల్వ ఏర్పాట్లు తదితర అంశాలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. కొనుగోలు కేంద్రాలకు వచ్చిన రైతులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు.
రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పారదర్శకంగా కొనుగోళ్లు నిర్వహించాలని సంబంధిత అధికారులకు కలెక్టర్ సూచించారు. కొనుగోలు చేసిన మొక్కజొన్నను గోదాముల్లో సక్రమంగా నిల్వ చేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అలాగే మద్దతు ధర ప్రకారం రైతులకు సకాలంలో చెల్లింపులు జరిగేలా చూడాలని అధికారులను ఆదేశించారు.
రైతుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని అధికారులకు సూచించిన కలెక్టర్, కొనుగోలు ప్రక్రియలో ఎలాంటి నిర్లక్ష్యం ఉండకూడదన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కో-ఆపరేటివ్ అధికారి రఘునాథ్ రావు, కో-ఆపరేటివ్ శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.