కోరుట్ల, ముద్ర: జై భీమ్ జై బాపు జై సంవిధాన్ కార్యక్రమంలో భాగంగా కోరుట్ల మండల నాయకుల ఆధ్వర్యంలో పైడిమడుగు, జోగన్ పల్లి గ్రామంలో పాదయాత్ర నిర్వహించారు. ఈ సంధర్భంగా మండలాధ్యక్షులు కొంతం రాజం మాట్లాడుతూ అహింసా పద్ధతిలో పోరాటం చేస్తూ ప్రపంచానికి ఆదర్శంగా నిలిచి స్వాతంత్రం సిద్ధింపచేసిన మహాత్మా గాంధీతో పాటు ప్రజల స్వేచ్ఛ, సమానత్వం కోసం రాజ్యాంగం రచించిన డా.బాబా సాహెబ్ అంబేద్కర్ ను బిజెపి, ఆర్ఎస్ఎస్ అవమానపరుస్తున్నాయని మండిపడ్డారు. పార్లమెంట్ సాక్షిగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అంబేద్కర్ కు వ్యతిరేకంగా చేసిన వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనం అన్నారు. మహనీయుల ఆశయాలను కాపాడటంతో పాటు ప్రజలకు స్వేచ్ఛను ప్రసాదించిన రాజ్యాంగాన్ని పరిరక్షించడానికి కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమం నిర్వహిస్తుందని అన్నారు.ఈ పాదయాత్ర ద్వారా రాజ్యాంగ గొప్పతనాన్ని ప్రజలకి తెలియజేయడంతో పాటు మహనీయులను స్మరించేందుకు వారు చేసిన సేవలను నేటి తరానికి తెలియజేయపరిచే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారని తెలిపారు.ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పెరుమాండ్ల సత్యనారాయణ, మార్కెట్ కమిటీ చైర్మన్ పన్నాల అంజిరెడ్డి, యువజన కాంగ్రెస్ నియోజకవర్గ మాజీ అధ్యక్షులు ఏలేటి మహిపాల్ రెడ్డి, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ పుల్లూరి వెంకటేష్, బీసీ సెల్ అధ్యక్షులు గడ్డం వెంకటేష్, కిసాన్ సెల్ అధ్యక్షుడు బొల్లె నర్సయ్య, యూత్ మండల మాజీ ఉపాధ్యక్షులు సైదు గంగాధర్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
