ప్రజా పాలనలోనే ప్రజా సంక్షేమం – గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం అండ
ముద్ర, నల్గొండ :
తెలంగాణలో మరో పదిహేనేళ్లు కాంగ్రెస్ పార్టీనే అధికారంలో ఉంటుందని మంత్రి కోమటిరెడ్డి ధీమా వ్యక్తం చేశారు. గురువారం ప్రజాపాలన-ప్రగతి కార్యాచరణ ప్రణాళికలో భాగంగా నల్లగొండలో ఏర్పాటు చేసిన సమావేశంలో కోమటిరెడ్డి పాల్గొని మాట్లాడారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో కుటుంబ పాలన తప్ప ప్రజలకు ఎలాంటి సంక్షేమ పథకాలు అమలు కాలేదని విమర్శించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతనే ప్రజా పాలన మొదలైందన్నారు. అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందుతున్నాయని చెప్పారు. పేదలందరికీ తెల్ల రేషన్ కార్డులు, ఉచిత కరెంటు బిల్లు, ఉచిత బస్సు ప్రయాణం, రైతు భరోసా, ఇందిరమ్మ ఇండ్లు వంటి ఎన్నో సంక్షేమ పథకాలు ఇస్తున్నట్లు వివరించారు. సర్పంచులు గ్రామాల అభివృద్ధికి చిత్తశుద్ధితో పనిచేయాలన్న మంత్రి.. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ బాధ్యతతో వ్యవహరించాలన్నారు. ప్రజల్లో మంచి పేరు తెచ్చుకోవాలని సూచించారు. గ్రామాల్లో ఎలాంటి సమస్య ఉన్న సర్పంచులు నేరుగా కలెక్టర్ను తనను కలవచ్చని చెప్పారు. గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం అన్ని విధాలుగా కృషి చేస్తుందని మంత్రి కోమటిరెడ్డి భరోసా ఇచ్చారు.