ముద్ర ప్రతినిధి,సంగారెడ్డి:
కొండాపూర్ లో వంద పడకల క్రిటికల్ కేర్ బ్లాక్ నిర్మాణానికి గురువారం రోజు స్థానిక ఎమ్మెల్యే అరికపుడి గాంధీతో కలిసి ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ గురువారం మధ్యాహ్నం శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడుతూ

రోడ్డు ప్రమాదాలు,ఇతర అత్యవసర పరిస్థితుల్లో బాధితులను తక్షణమే హాస్పిటల్స్కు తరలించి వారి ప్రాణాలు కాపాడేలా ప్రభుత్వం సమగ్ర ట్రామా కేర్ పాలసీని ప్రారంభించిందన్నారు.
ఇందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా జాతీయ, రాష్ట్ర రహదారుల వెంబడి అవసరమైన అన్ని వసతులతో 109 ట్రామా కేర్ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు.రోడ్డు ప్రమాదం, ఇతర అత్యవసర పరిస్తితి ఏర్పడిన పది నిమిషాల లోపు ఘటనా స్థలానికి చేరుకునేలా ఎమర్జెన్సీ రెస్పాన్స్ వ్యవస్థను బలోపేతం చేస్తున్నామన్నారు.
(108) అంబులెన్స్ల సంఖ్య పెంచుతున్నామని,రాష్ట్రవ్యాప్తంగా 31 క్రిటికల్ కేర్ బ్లాకులు ఏర్పాటు చేస్తున్నామని మంత్రి పేర్కొన్నారు.నిజామాబాద్, నల్గొండ,కరీంనగర్, మహబూబాబాద్,జగిత్యాల, సంగారెడ్డి,నారాయణపేట్, ఆదిలాబాద్ జిల్లాలో క్రిటికల్ కేర్ బ్లాకులను ఇప్పటికే ప్రారంభించుకున్నానీ స్పష్టం చేసారు.మరో 21 సీసీబీల నిర్మాణం కొనసాగుతోందనీ,ఈ ఏడాది చివరికలా అన్నీ అందుబాటులోకి తీసుకొస్తామన్నారు.
కొండాపూర్లో రూ.41 కోట్ల రూపాయల వ్యయంతో వంద బెడ్ల క్రిటికల్ కేర్ బ్లాక్ నిర్మాణానికి శంకుస్థాపన చేసుకున్నామని,వీలైనంత వేగంగా నిర్మాణం పూర్తి చేసి, అత్యాధునిక వసతులతో వైద్య సేవలు అందించే విధంగా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి వెల్లడించారు.ఐటీ కారిడార్లో లైఫ్ స్టైల్ కారణంగా అనారోగ్య సమస్యలు పెరుగుతున్నాయనీ, కొండాపూర్ ఏరియా హాస్పిటల్లో ఇక్కడి ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నామన్నారు. భవిష్యత్తులో మరిన్ని అత్యాధునిక వైద్య సేవలు ఇక్కడ అందుబాటులోకి తీసుకొస్తామని తెలిపారు.
ఇక్కడ నివసించే ప్రజల కోసం ఈక్రిటికల్ కేర్ సేవలు ఎంతగానో ఉపయోగపడుతాయనీ మంత్రి దామోదర్ రాజ నర్సింహ పేర్కొన్నారు.