Take a fresh look at your lifestyle.

ప్రభుత్వం విద్య, వైద్య రంగాల అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోంది : ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి

ముద్ర ప్రతినిధి, యాదాద్రి భువనగిరి :
ప్రభుత్వం విద్య, వైద్య రంగాల అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి అన్నారు. బుధవారం భువనగిరి మండలంలోని ముత్తిరెడ్డి గూడెంలో ప్రభుత్వ నర్సింగ్ కళాశాల భవన నిర్మాణ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామీణ ప్రాంత విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు. ముఖ్యంగా వైద్య విద్యను అందుబాటులోకి తీసుకురావడం ద్వారా పేద, మధ్యతరగతి కుటుంబాల విద్యార్థులకు మెరుగైన అవకాశాలు కల్పిస్తున్నామని తెలిపారు. ప్రభుత్వ నర్సింగ్ కళాశాల నిర్మాణం పూర్తయితే స్థానిక యువతకు ఉన్నత విద్యతో పాటు ఉపాధి అవకాశాలు కూడా విస్తృతంగా లభిస్తాయని పేర్కొన్నారు. వైద్య రంగంలో నైపుణ్యం కలిగిన సిబ్బందిని తయారు చేయడంలో ఈ కళాశాల కీలక పాత్ర పోషిస్తుందని, భవిష్యత్‌లో భువనగిరి ప్రాంత ప్రజలకు మరింత మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ఇది దోహదపడుతుందని అన్నారు.
భువనగిరి ప్రాంత అభివృద్ధిలో విద్య, వైద్య రంగాలకు ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని, ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు నిరంతరం కృషి కొనసాగుతోందన్నారు.
ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ భాస్కర్ రావు, భువనగిరి మున్సిపల్ ఛైర్పర్సన్ తంగళ్ళపల్లి శ్రీవాణి రవికుమార్ , వైస్ ఛైర్పర్సన్ పోతంశెట్టి మంజుల వెంకటేశ్వర్లు, పట్టణ మండల, గ్రామాల ప్రజాప్రతినిధులు,నాయకులు అధికారులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.