ముద్ర ప్రతినిధి, భువనగిరి :
జిల్లాలోని అన్ని మున్సిపాలిటీలలో పెండింగ్లో ఉన్న అభివృద్ధి పనులను త్వరగా పూర్తి చేయాలని అదనపు కలెక్టర్ ఎ. భాస్కర్ రావు మున్సిపల్ కమిషనర్లను ఆదేశించారు. శుక్రవారం ఆయన ఛాంబర్లో మున్సిపల్ కమిషనర్ల సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ మున్సిపాలిటీలలో జరుగుచున్న పలు అభివృద్ధి పనులపై అనగా యుఐడిఎఫ్, టీయుఎఫ్ఐడిసి, అమృత స్కీం, స్వచ్ఛ భరత్, స్టాంప్ డ్యూటీ పనులు, చేపట్టబోతున్న పనుల పురోగతి పై సమీక్షిస్తూ పెండింగ్లో ఉన్న పనులను త్వరితగతిన పూర్తి చేయుటకు సంబంధిత కాంట్రాక్టర్స్ తో సమావేశం ఏర్పాటు చేసుకొని వారికి తగిన సూచనలు ఆదేశాలు ఇవ్వాలన్నారు. వేసవి కాలం దృష్ట్య ఏ మున్సిపాలిటీలో కూడా నీటి ఎద్దడి ఉండకూడదని ప్రజలందరికీ పూర్తిస్థాయిలో వీటి సరఫరా చేయవలసిందిగా అందుకు సంబంధించి అన్ని ఏర్పాట్లు ముందస్తుగా చేసుకోవాల్సిందిగా సూచించారు. పట్టణంలో పారిశుద్ధ్య పనులను ప్రతిరోజు క్రమం తప్పకుండా ముఖ్యంగా చెత్త కుప్పలు లేకుండా చూసుకోవాల్సిందిగా తెలిపారు. 5% రెబటే విషయమై ప్రజలందరికీ అవగాహన కల్పించి ఆస్తిపన్ను వసూళ్లు చేయాలన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లాలోని అన్ని మున్సిపాలిటీల కమిషనర్లు, పబ్లిక్ హెల్త్ డీఇఇ, ఏఇ లు, సిబ్బంది, పాల్గొన్నారు.