ముద్ర ప్రతినిధి, నిర్మల్:
నిర్మల్ జిల్లాలో పదో తరగతి పరీక్షలు శనివారం ప్రారంభమయ్యాయి. వచ్చే నెల 16 వరకు ఈ పరీక్షలు జరగనున్నాయి. జిల్లా వ్యాప్తంగా 47 సెంటర్లలో 9,750 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవుతున్నారు. వీరిలో 4,786 మంది బాలురు కాగా, 4,964 మంది బాలికలు. పరీక్షలను సజావుగా నిర్వహించేందుకు 47 మంది చొప్పున చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్మెంటల్ అధికారులను నియమించారు. అలాగే 535 మంది ఉపాధ్యాయులు ఇన్విజిలేటర్లుగా పని చేస్తున్నారు. ఇదిలా ఉండగా జిల్లా వ్యాప్తంగా పరీక్షా కేంద్రాల పరిసరాల్లో పోలీసులు నిషేధాజ్ఞలు విధించారు. పరీక్ష ముగిసే వరకు జిరాక్స్ కేంద్రాలు మూసి ఉంచేలా ఆదేశాలు జారీ చేశారు. కాగా పరీక్షా కేంద్రాలు ఎక్కడున్నాయో తెలుసుకునేందుకు ఈ సారి హాల్ టికెట్లలో స్కానర్ ద్వారా లొకేషన్ చూసుకునే సౌకర్యం కల్పించారు. తొలిరోజు తెలుగు పరీక్షకు జిల్లా వ్యాప్తంగా ఆరుగురు హాజరు కాలేదు. కలెక్టర్ అభిలాష అభినవ్ బాలికల ఉన్నత పాఠశాలను, ఎస్పీ జానకి షర్మిల మేధ ఉన్నత పాఠశాలను సందర్శించి పరీక్షల సరళిని పరిశీలించారు. జిల్లా అడిషనల్ కలెక్టర్లు, విద్యాశాఖాధికారి జిల్లాలోని పలు పరీక్షా కేంద్రాలను సందర్శించారు.