ముద్ర ప్రతినిధి, నిర్మల్:
జిల్లాలో బాల్య వివాహాల నిర్మూలన కోసం చేపట్టిన 100 రోజుల ప్రత్యేక కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన ప్రచార రథాన్ని జిల్లా అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు జండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బాల్య వివాహాలను పూర్తిగా నిర్మూలించాలనే ఉద్దేశంతో “బాల్య వివాహ రహిత భారత్” కార్యక్రమంలో భాగంగా ఈ ప్రచార రథాన్ని ప్రారంభించినట్లు తెలిపారు. ప్రచార రథం ద్వారా 18 సంవత్సరాల లోపు బాలికలకు, 21 సంవత్సరాల లోపు బాలురకు వివాహం చేయడం చట్టరీత్యా నేరమని, బాల్య వివాహాలు పిల్లల ఆరోగ్యం, విద్య, భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం చూపుతాయని అవగాహన కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో విజన్ సంస్థ జిల్లా కో ఆర్డినేటర్ శరత్ కుమార్, రాజు, బాలల పరిరక్షణ అధికారి మురళి, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ చైర్మన్ వహీద్, చైల్డ్లైన్ కోఆర్డినేటర్ గంగాధర్, మిషన్ శక్తి సిబ్బంది, విజన్ సంస్థ సిబ్బంది, వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు పాల్గొన్నారు.