ముద్ర ప్రతినిధి, నిర్మల్:
నిర్మల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులు కొండాపూర్ గ్రామ పంచాయతీని తమ క్షేత్ర పర్యటన లో భాగంగా సందర్శించారు. ప్రభుత్వ పాలనా శాస్త్రం, రాజనీతి శాస్త్ర విభాగానికి చెందిన విద్యార్థులకు ప్రత్యక్ష పరిశీలనానుభవం ద్వారా విషయ పరిజ్ఞానాన్ని పెంపొందించడం ఈ పర్యటన ముఖ్య ఉద్దేశ్యమని డాక్టర్ యు గంగాధర్ తెలిపారు. గ్రామ పంచాయతీ నిర్మాణం, అధికారాలు, విధులు, సమావేశాలు, ఆర్థిక వనరుల గురించి ప్రత్యక్షంగా తెలుసు కున్నారు. గ్రామ సభ ప్రాముఖ్యత, గ్రామంలో చేపట్టే లబ్ధిదారుల ఎంపిక గ్రామసభల ద్వారానే జరుగుతుందనే విషయాన్ని గ్రహించారు. గ్రామంలో చేపట్టే ఎలాంటి అభివృద్ధి కార్యక్రమానికైనా గ్రామపంచాయతీ పాలకవర్గ తీర్మానం అత్యంత ముఖ్యమని తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ఎర్ర గొల్ల ముత్తవ్వ భాస్కర్, ఉపసర్పంచ్ పటేరి పోతన్న, పంచాయితీ కార్యదర్శి నితీష్ కుమార్, రాజనీతి శాస్త్ర అధ్యాపకులు రవీందర్ పాల్గొన్నారు.