మధ్యాహ్న భోజన పథకం మోనును వంద శాతం అమలు చేయాలి ప్రహరీలు లేని పాఠశాలల జాబితా తయారు చేసి ఇవ్వాలి – కలెక్టర్ ప్రతీక్ జైన్
ముద్ర, నారాయణ పేట:
జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలు, సంక్షేమ శాఖల వసతి గృహాలలో మధ్యాహ్న భోజన పథకం మోను ను కచ్చితంగా వంద శాతం అమలు చేయాలని కలెక్టర్ ప్రతీక్ జైన్ ఆదేశించారు. మధ్యాహ్న భోజనానికి వినియోగించే బియ్యం, ఇతర వంట సరకులు పూర్తి స్థాయిలో నాణ్యతతో కూడినవి వినియోగించాలన్నారు. జిల్లా అధికారులతో తీసుకుంటున్న తొలి సమావేశం విద్య పైనే అని.. విద్యకు ప్రాధాన్యత ఇవ్వడం మన అందరి బాధ్యత అని ఆయన తెలిపారు. మధ్యాహ్న భోజనం మరియు డైట్ ప్లాన్ అమలుపై కలెక్టరేట్ లోని వీసీ హాల్ నుంచి మంగళ వారం సాయంత్రం ఆయన జిల్లా అధికారులతో గూగుల్ మీట్ ద్వారా సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ… ఈ నెల 17 నుంచి 21 లోపు వారికి నోడల్ అధికారులు/మండల ప్రత్యేక అధికారులు వారికి కేటాయించిన పాఠశాలలు, రెసిడెన్షియల్ పాఠశాలలు, హాస్టల్ ల పర్యవేక్షణ చేసి, విజిట్ రిపోర్ట్ ను తప్పనిసరిగా గూగుల్ ఫార్మ్ లో నివేదిక పంపించాలని సూచించారు. దీనిని అత్యంత ప్రాధాన్యతగా భావించి కేటాయించిన గడువులోపు విజిట్ లను పూర్తి చేయాలన్నారు. ఇకపై మండలానికి ఒక తహసిల్దార్, ఎంపీడీవో, ఎంఈవో, ఎస్. ఐ తో కూడిన అధికారుల బృందాన్ని ఏర్పాటు చేయనున్నట్లు, ఆ కమిటీ వారం లో రెండుసార్లు తమ పరిధిలోని ప్రభుత్వ పాఠశాలలు, వసతి గృహాలను సందర్శించి అక్కడి మౌలిక వసతి సదుపాయాలతో పాటు మధ్యాహ్న భోజన నాణ్యతను పరిశీలించాలని ఆయన తెలిపారు. అంతేకాకుండా ఆయా పాఠశాలలు,వసతి గృహాల విద్యార్థులతో కలిసి వారంలో కచ్చితంగా రెండుసార్లు మధ్యాహ్న భోజనం చేసి నాణ్యత, రుచిని పరిశీలించాలని ఆదేశించారు. జిల్లాలో కొన్ని పాఠశాలలకు ప్రహరీలు సరిగ్గా లేవని, అసాంఘిక కార్య కలాపాలు జరగకుండా చూడాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. ప్రహరీలు లేని పాఠశాలల జాబితా తయారు చేసి ఇవ్వాలన్నారు. వసతి గృహాల లోపలికి ఎవ్వరిని అనుమతించరాదని మరీ ముఖ్యంగా బాలికల వసతి గృహాల లోపలికి ఎవ్వరిని అనుమతించ వద్దని తేల్చి చెప్పారు. అవసరమైతే బాలికల వసతి గృహాల బయట లోపలికి వెళ్లడానికి ఎవరికి అనుమతి లేదనే ప్లెక్సీలు పెట్టాలని ఆయన తెలిపారు. ఈ విషయంలో ప్రోటోకాల్ తప్పని సరిగా పాటించాల్సిందే అని ఆయన స్పష్టం చేశారు. ఆర్ బీ ఎస్ కే బృందాలు క్రమం తప్పకుండా వైద్య శిబిరాలు నిర్వహించాలని, ఎక్కడెక్కడ శిబిరాలు నిర్వహించారో నివేదిక తీసుకోవాలని వైద్య శాఖ అధికారులకు సూచించారు. ప్రస్తుతం జరుగుతున్న పదో తరగతి పరీక్షలను సజావుగా కొనసాగించాలని, పరీక్షా కేంద్రాల లోపలికి ఇన్విజిలేటర్లు ఎవ్వరూ సెల్ ఫోన్లు తీసుకు వెళ్లరాదని, కేంద్రాల్లోకి సెల్ ఫోన్ల అనుమతి లేదన్నారు.