ముద్ర ప్రతినిధి, నిర్మల్:
అత్యవసర వైద్య సేవల విభాగాన్ని త్వరలోనే ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. అలాగే కార్పొరేట్ తరహా వైద్య సేవలు అందుబాటులోకి తేవాలని సూచించారు. జిల్లా ప్రభుత్వ సాధారణ ఆసుపత్రి ప్రాంగణంలో నిర్మాణంలో ఉన్న అత్యవసర వైద్య సేవల విభాగాన్ని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ బుధవారం తనిఖీ చేశారు. ఆసుపత్రి భవంతి నిర్మాణానికి సంబంధించిన వివరాలను అధికారులు కలెక్టర్ కు వివరించారు. శస్త్ర చికిత్సల గదులు, డయాలసిస్ కేంద్రం, ఐసియు, గైనిక్ విభాగం, ఎలక్ట్రికల్ యూనిట్, ఫైర్ సేఫ్టీ విభాగాలు పరిశీలించారు. మిగిలి ఉన్న పనులు త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు వైద్య సేవల నిమిత్తం అందుబాటులోకి తేవాలన్నారు. సమీపంలోని యుడిఐడి కేంద్రం, డ్రగ్స్ డి అడిక్షన్ సెంటర్లు పరిశీలించారు. ప్రభుత్వ సాధారణ ఆసుపత్రిని తనిఖీ చేశారు. ఆసుపత్రిలోని అత్యవసర వైద్య సేవల విభాగం, రక్త పరీక్షల గది, తదితర విభాగాలు పరిశీలించారు. వైద్యులు, సిబ్బంది తప్పనిసరిగా సమయపాలన పాటిస్తూ, ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని తెలిపారు. ఈ తనిఖీలలో ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపల్ శారద, తహసీల్దార్ రాజు, ఇతర అధికారులు, తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు గుల్జార్ మార్కెట్ లో బస్తీ దవాఖానను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలోని అన్ని రకాల రిజిస్టర్లను పరిశీలించారు. ఆస్పత్రిలో చికిత్స కొరకు రోగులకు సేవా దృక్పథంతో వైద్యం అందించాలన్నారు. ఆసుపత్రి ప్రాంగణాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలని అన్నారు. ఆసుపత్రిలో అందిస్తున్న వైద్య సేవల గురించి వివరాలు వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ఈ తనిఖీలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి రాజేందర్, అధికారులు సౌమ్య, స్థానిక కౌన్సిలర్ తౌహిదుద్దిన్, ఇతర అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.