- కలెక్టర్ కోయ శ్రీ హర్ష.
ముద్ర ప్రతినిధి, పెద్దపల్లి: ప్రజావాణిలో ప్రజల నుంచి వచ్చే అర్జీలను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ కోయ శ్రీ హర్ష సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం ప్రజావాణి కార్యక్రమం సందర్భంగా కలెక్టరేట్లో అదనపు కలెక్టర్ డి.వేణు తో కలిసి ప్రజల నుండి దరఖాస్తులను స్వీకరించారు. సుల్తానాబాద్ మండలం, కొదురుపాక గ్రామానికి చెందిన మచ్చ రాములు సర్వే నెంబర్ 803 ఏ లో 11 గుంటల భూమి, సర్వే నెంబర్ 815 ఏదో 3 గుంటలో భూమి గల్లంతు అయిందని, భూ భారతిలో సర్వే చేయించి న్యాయపరంగా కొత్త పాస్ పుస్తకం మంజూరు చేయాలని కోరుతూ దరఖాస్తు చేసుకోగా తహసిల్దార్ కు రాస్తూ అవసరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ తెలిపారు. రామగుండం మండలం 8 ఇంక్లైన్ కాలనీ కు చెందిన కోండా రాజమ్మ సింగరేణి భూసేకరణ క్రింద తీసుకున్న నాలుగు గంటల భూమి లో 2 గుంటల కు మాత్రమే పరిహారం అందించారని, మరో 2 గుంటల భూమికి పరిహారం ఇప్పించాలని కోరుతూ దరఖాస్తు చేసుకోగా తహసిల్దార్ కు రాస్తూ అవసరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. ప్రజావాణి కార్యక్రమంలో సంబంధిత జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.