ముద్ర ప్రతినిధి, మెదక్: ఫోటో గ్రాఫర్లు ఐక్యతతో తమ హక్కులను సాధించుకోవాలని ఫోటోగ్రఫీ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు ఎస్.కె. హుస్సేన్ అన్నారు. ఉమ్మడి మెదక్ జిల్లా ఫోటోగ్రఫీ అసోసియేషన్ విస్తృత స్థాయి సమావేశాన్ని మెదక్ జిల్లా కేంద్రంలో నిర్వహించారు. ఫోటోగ్రాఫర్ ఈ రంగంలో రానున్న కాలంలో నిలదొక్కుకోవడానికి విపరీతమైన ఆధునీకరణలను ఎదుర్కోవాల్సి వస్తుందని, అందుకు ప్రతి ఫోటోగ్రాఫర్ అన్ని విధాలుగా సిద్ధంగా ఉండాలని అన్నారు. ఫోటోగ్రాఫర్ సంక్షేమం కోసం తెలంగాణ ఫోటోగ్రఫీ యూనియన్ రాష్ట్రంలోని ప్రముఖ ఆసుపత్రీతో ఎంఓయు చేసుకుందని, సభ్యత్వ నమోదుకు సైతం పూర్తి డిజిటలైజేషన్ ప్రక్రియను తీసుకొచ్చామని తెలిపారు. కుటుంబ భరోసా పథకం ద్వారా ఇతర వ్యవస్థలపై ఆధారపడకుండా ఫోటోగ్రాఫర్ల సంఘటితంతో ఇప్పటివరకు మృతిచెందిన 140 మంది ఫోటోగ్రాఫర్ల కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించామన్నారు.రానున్న కాలంలో ఫోటోగ్రాఫర్ల సంక్షేమం కోసం మరిన్ని విధివిధానాలను రాష్ట్ర కార్యవర్గం తీసుకురానుందని అన్నారు.ఈ కార్యక్రమంలో వ్యవస్థాపక అధ్యక్షుడు వెంకట్ రెడ్డి, ఉపాధ్యక్షలు వేషాల శారద, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రవి, కోశాధికారి మాధవ రెడ్డి, నాగరాజు, అధ్యక్షులు సుప్పాల శ్రీనివాస్, కంచి ఆనంద్, దొంతుల శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.