- జిల్లా కలెక్టర్ బి . సత్య ప్రసాద్.
ముద్ర ప్రతినిధి,జగిత్యాల: సీజనల్ వ్యాధుల వ్యాప్తిని నిరోధించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులకు జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్ సూచించారు.శుక్రవారం జగిత్యాల పట్టణంలోని లింగంపేట్ లో కలెక్టర్ పరిసరాలను పరిశీలించి సీజనల్ వ్యాధుల నియంత్రణకు ప్రణాళికాబద్ధంగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.రాబోయే 3 నెలల పాటు పారిశుధ్య నిర్వహణను అత్యంత ప్రాధాన్యత అంశంగా తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. గ్రామ పారిశుద్ధ్య కమిటీలలో వైద్య శాఖ సిబ్బంది భాగస్వామ్యం చేయాలని అన్నారు.ఆశా కార్యకర్తల దగ్గర అన్ని విధాల మందులు జ్వరం దగ్గు సీజనల్ వ్యాధులు సంబంధించి ప్రజలకు అవసరమైన మేర అందించాలని అన్నారు.సీజనల్ వ్యాధుల నియంత్రణ కోసం గ్రామాలలో ఎక్కడ నీరు నిల్వ ఉండకుండా చర్యలు తీసుకోవాలని, సీజనల్ వ్యాధుల నియంత్రణకు చేపట్టాల్సిన చర్యల గురించి విస్తృతంగా ప్రచారం చేయాలని, డ్రైనేజీలలో ఆయిల్ బాల్స్ వేయాలని అన్నారు.ప్రతి 30 ఇండ్లు తిరిగి పూర్తి స్థాయిలో డ్రై డే పాటించేలా చూడాలని, గ్రామాలలో రెగ్యులర్ గా ఫాగ్గింగ్ చేయాలని అన్నారు.జూన్ 25 నాటికి జిల్లాలోని అన్ని మండలాల్లో ఆర్.ఎం.ఓ లు సీజనల్ వ్యాధులకు అందించాల్సిన వైద్యం పట్ల సమావేశాలు నిర్వహించాలని వైద్యశాఖ అధికారులు స్థానిక సంస్థల అధికారులతో సమన్వయం చేసుకుంటూ గతంలో అధికంగా కేసులు వచ్చిన ప్రాంతాల్లో పారిశుధ్య నిర్వహణ పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని అన్నారు.ఈ సమావేశంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ ప్రమోద్ కుమార్, మున్సిపల్ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
