ముద్ర ప్రతినిధి కరీంనగర్:
కొత్తపల్లి–హుస్నాబాద్ ఫోర్లైన్ రోడ్డు పనుల పురోగతిపై సమీక్ష
కొత్తపల్లి నుంచి హుస్నాబాద్ వరకు ఫోర్లైన్ రోడ్డు నిర్మించనున్న నేపథ్యంలో విద్యుత్ స్తంభాలు, లైన్ల షిఫ్టింగ్ పనులను వేగవంతంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా సంబంధిత అధికారులను ఆదేశించారు.
గురువారం తిమ్మాపూర్ మండలం కొత్తపల్లి గ్రామంలో కలెక్టర్ ఈ పనుల పురోగతిని సమీక్షించారు. ఈ సందర్భంగా విద్యుత్, రోడ్లు-భవనాల శాఖ అధికారులతో చర్చించి వివరాలు తెలుసుకున్నారు. కొత్తపల్లి నుంచి హుస్నాబాద్ వరకు రోడ్డు పక్కన ఉన్న విద్యుత్ స్తంభాలు, లైన్ల మార్పిడి పనులపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని సూచించారు. వాహనదారులు, ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా పనులు నిర్వహించాలని, ఎక్కడా విద్యుత్ అంతరాయం కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. ఈ పనుల్లో రోడ్లు-భవనాల శాఖ, విద్యుత్ శాఖ అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ ఆదేశించారు. రెండు శాఖలు కలిసి వేగవంతంగా పనులు పూర్తి చేస్తే ఫోర్లైన్ రోడ్డు నిర్మాణం త్వరితగతిన ముందుకు సాగుతుందని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో ఆర్డీవో మహేశ్వర్, జిల్లా పంచాయతీ అధికారి జగదీశ్వర్, ఆర్ & బి ఈ నరసింహచారి, విద్యుత్ శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.