Take a fresh look at your lifestyle.

నేను, పొన్నం కలిసి పనిచేస్తాం

  • నియోజకవర్గాన్ని అద్బుతంగా తీర్చిదిద్దుతాం.
  • ప్రతి ప్రభుత్వ పాఠశాలలో ఆర్వో ప్లాంట్ ను ఏర్పాలు చేస్తా.
  • హుస్నాబాద్ లో సైనిక్ స్కూల్ ను ఏర్పాటు చేస్తాం.
  • నవోదయ స్కూల్ ను ఏర్పాటు చేసి వచ్చే ఏడాది అడ్మిషన్లు ప్రారంభయ్యేలా చేస్తాం.
  • సర్కార్ బడుల్లో చదవండి.. సైకిల్ ను బహుమతిగా ఇస్తా.
  • వచ్చే ఏడాది కూడా టెన్త్ విద్యార్థులకు సైకిళ్లు ఇస్తా.
  • ఈ సైకిల్ నరేంద్ర మోదీ గిఫ్ట్.
  • త్వరలోనే నర్సరీ నుండి 6వ తరగతి చదివే పిల్లలకు ‘మోదీ కిట్స్’ అందిస్తా.
  • హుస్నాబాద్ లో సైకిళ్ల పంపిణీ కార్యక్రమంలో కేంద్ర మంత్రి బండి సంజయ్.

ముద్ర ప్రతినిధి, కరీంనగర్ : కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో తాను రాజకీయాలు చేయబోనని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. రాజకీయాలకు అతీతంగా రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ తో కలిసి పనిచేస్తూ హుస్నాబాద్ సహా కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు తెలిపారు. అందులో భాగంగా ఇద్దరం కలిసి హుస్నాబాద్ నియోజకవర్గంలో త్వరలోనే నవోదయ స్కూల్ ను ఏర్పాటు చేసి వచ్చే విద్యా సంవత్సరంలో అడ్మిషన్లు ప్రారంభయ్యేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. దీంతోపాటు ఈ ప్రాంతంలో సైనిక్ స్కూల్ ను ఏర్పాటు చేసేందుకు క్రుషి చేస్తున్నామన్నారు. మంత్రి పొన్నం ప్లాస్టిక్ ను నిర్మూలించడంలో భాగంగా హుస్నాబాద్ లో ‘స్టీల్ బ్యాంక్’ ను ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. ప్రతి ఒక్క ప్రజా ప్రతినిధి సమాజానికి తనవంతుగా ఏదో ఒక మంచి కార్యక్రమం చేపట్టాలని కోరారు. మోదీ స్పూర్తితో తాను ‘మోదీ గిఫ్ట్’ పేరుతో ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులందిరికీ ఉచితంగా సైకిళ్లను అందిస్తుండటం సంతోషంగా ఉందన్నరు. అతి త్వరలోనే నర్సరీ నుండి 6వ తరగతి చదివే విద్యార్థులందరికీ బ్యాగు, స్టీల్ వాటర్ బాటిల్, నోట్ బుక్స్, పెన్ను, పెన్సిల్ తో కలిపి ‘మోదీ కిట్స్’ ఇవ్వబోతున్నా. ప్రతి ఏరియాలో వాటర్ ప్లాంట్ ను ఏర్పాటు చేయడానికి క్రుషి చేస్తా. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థులు గల్లా ఎగరేసుకునేలా చేస్తా. అందుకోసం స్కూళ్లలో మౌలిక సదుపాయాలు కల్పించేందుకు కృషి చేస్తా అన్నారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే టెన్త్ విద్యార్థులకు బంపర్ ఆఫర్ ప్రకటించారు. ‘‘ప్రభుత్వ పాఠశాలల్లో చదవండి. సైకిల్ ను బహుమతిగా పొందండి’’అని ఆఫర్ ఇచ్చారు. ఇకపై తాను ఎంపీగా ఉన్నంత కాలం ప్రతి ఏటా ప్రభుత్వ పాఠశాలల్లో పదవ తరగతి చదువుకునే విద్యార్థులందరికీ ఉచితంగా సైకిళ్లను అందజేస్తానని ప్రకటించారు. కష్టపడి చదివితే ఉన్నత స్థాయికి ఎదుగుతారనే దానికి సిద్దిపేట జిల్లా కలెక్టర్, అదనపు కలెక్టర్, పోలీస్ కమిషనర్ లే నిదర్శనమన్నారు.

సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గ కేంద్రంలో ‘‘మోదీ గిఫ్ట్’’ పేరుతో ప్రభుత్వ పాఠశాలల్లో టెన్త్ చదివే వందలాది మంది విద్యార్థులకు ఉచితంగా సైకిళ్లను పంపిణీ చేశారు. అట్టహాసంగా జరిగిన ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రి బండి సంజయ్ తోపాటు జిల్లా కలెక్టర్ హైమావతి, అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్, స్థానిక ఆర్డీవో, డీఈవో తదితరులు పాల్గొన్నారు. ఈ సదర్భంగా బండి సంజయ్ కుమార్ కు విద్యార్థులు, స్థానిక నాయకులు వినూత్న రీతిలో ఘన స్వాగతం పలికారు. పలువురు విద్యార్థులు బండి సంజయ్ కు ముందస్తుగా రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలపడంతోపాటు రాశీ కట్టారు. అనంతరం కేంద్ర మంత్రి బండి సంజయ్ ప్రసంగిస్తూ ఈ సైకిల్ ‘‘మోదీ గిఫ్ట్’’. ఎన్నికల్లో గెలిపించిన ప్రజలకు ఏదో ఒక మంచి పని చేయాలంటూ ప్రధాని మోదీ సూచన చేసిన మేరకు, వారి స్పూర్తితోనే ఈ సైకిళ్లను పంపిణీ చేస్తున్నా. నాకు పిల్లలకు సైకిళ్లను పంపిణీ చేయాలనే ఆలోచన రావడానికి కారణాలున్నాయి. నిర్మల్ జిల్లాలో ప్రజా సంగ్రామ యాత్ర పేరుతో పాదయాత్ర చేస్తున్నప్పుడు ఓ చెట్టుకింద కూలీలు కూర్చున్నరు. వాళ్ల దగ్గరకు పోతే ‘రాజకీయ నాయకులు ఓట్ల కోసమే వస్తారు. ఆ తరువాత రారు’’అని బదులిచ్చారు. నేను ఓట్ల కోసం రాలేదు.. మీ సమస్యలు తెలుసుకునేదుకు ఇక్కడికి వచ్చాను’’అని అనడంతో ‘‘మా సంగతి తరువాత అక్కడున్న పూరిగుడెసె చూడండి. అందులో ఒక పిచ్చోడు ఉన్నడు. ముసలామె ఉంది. వాళ్లు కష్టాల్లో ఉన్నారు’’అని అక్కడున్న కూలీలు చెప్పడంతో ఆ గుడెసె వద్దకు పోయి ఆ కుటుంబ పరిస్థితులను అడిగి తెలుసుకున్న. ఆ ఇంట్లో ఉన్న పిల్లవాడి పేరు రాంచరణ్. వాస్తవానికి అతను పిచ్చోడు కాదు. అతను స్కూల్ కు వెళ్లడానికి సైకిల్ లేదు. ఫ్రెండ్స్ అంతా స్కూల్ కు సైకిల్ మీద పోతున్నారట. సైకిలిస్తే స్కూల్ కు పోతానన్నడు. వెంటనే అతనికి సైకిల్ ఇప్పించిన. రెండు, మూడేళ్లు స్కూల్ కు వెళ్లిన రాంచరణ్ మళ్లీ ఈ మధ్యనే పరిస్థితి బాగోలేదని స్కూల్ మానేశారని విన్నా.. అందుకే వెంటనే మా నాయకులను పంపి వాళ్ల సమస్యలను తెలుసుకుని పరిష్కరించాలని కోరిన. వాస్తవానికి రాంచరణ్ కు సైకిల్ ఇచ్చిన తరువాత అతని కళ్లల్లో ఆనందం చూసిన తరువాత ప్రభుత్వ స్కూళ్లలో చదివే టెన్త్ విద్యార్థులందరికీ ఉచితంగా సైకిళ్లు ఇప్పించాలనే ఆలోచన వచ్చింది. కరీంనగర్ జిల్లా కలెక్టర్ ప్రతిపాదనతో ఆచరణ రూపంలో పెట్టిన. బాలికలను ఎంకరేజ్ చేస్తే ఏ స్తాయికి వెళతారో ఇక్కడున్న కలెక్టర్, అదనపు కలెక్టర్, ఎస్పీలే నిదర్శనం.

విద్యార్థులకు మొట్టమొదటి ఆస్తి సైకిల్. ఆ ఆస్తిని నేను మీకు అందజేస్తున్నా. ఈ సందర్బంగా అందరికీ చెబుతున్నా. ప్రభుత్వ పాఠశాలల్లో చదవండి. సైకిల్ ను బహుమతిగా పొందండి. ఇకపై వచ్చే ఏడాది కూడా ప్రభుత్వ స్కూళ్లలో టెన్త్ చదివే విద్యార్థులందరికీ సైకిళ్లు అందిస్తా. నేను ఎంపీగా ఉన్నంత కాలం టెన్త్ చదువుకునే విద్యార్థులందరికీ సైకిళ్లను పంపిణీ చేస్తా. కష్టపడి చదివితే ఉన్నత స్థాయికి ఎదుగుతారనే దానికి సిద్దిపేట జిల్లా కలెక్టర్, అదనపు కలెక్టర్, పోలీస్ కమిషనర్ లే నిదర్శనం. టీచర్ నుండి అనేక ఉద్యోగాలు చేస్తూ కలెక్టర్ గా ఎదిగిన హైమావతి పడిన కష్టం మనకు ఆదర్శం. కష్టపడి చదివి ఐఏఎస్, ఐపీఎస్ లుగా ఎంపికైన సిద్దిపేట అదనపు కలెక్టర్, పోలీస్ కమిషనర్ లను విద్యార్థులు ఆదర్శంగా తీసుకోవాలి. చదువుకోసం అంబేద్కర్ పడ్డ కష్టాలు, అవమానాలు అన్నీ ఇన్నీ కావు. వాటిని అధిగమిస్తూ ఏ స్థాయికి ఎదిగారు? తెలుసుకోండి. ఈ దేశానికి రాజ్యాంగాన్ని అందించి దేశ తలరాతను మార్చిన విషయాన్ని తెలుసుకోండి. వారి స్పూర్తితో ఎన్ని కష్టాలు, అవమానాలు ఎదురైనా వాటిని అధిగమిస్తూ బాగా చదువుకుని ఉన్నతస్థాయికి ఎదగాలి. అట్లాగే ప్రతి ఒక్కరూ తమకు చేతనైనంత మేరకు సమాజానికి సాయం చేయాలి.విద్యా రంగ అభివ్రుద్దికి మోదీ ప్రభుత్వం ఎంతో క్రుషి చేస్తోంది. అందులో భాగంగా యూపీఏ హయాంలో (2014 15 బడ్జెట్‌లో) విద్యా రంగానికి కేంద్రం 68 వేల 728 కోట్లు మాత్రమే కేటాయిస్తే.. ఈ ఒక్క ఏడాదే(2025 26) 1 లక్షా 28 వేల 650 కోట్ల రూపాయలు కేటాయించింది. అంటే యూపీఏతో పోలిస్తే విద్యా రంగానికి నిధుల కేటాయింపు రెట్టింపు పెరిగింది. ఈ 11 సంవత్సరాల్లో ఒక్క విద్యా రంగానికే దాదాపు 8 లక్షల కోట్ల రూపాయలకుపైగా ఖర్చు చేశామంటే విద్యా రంగంపై మోదీ ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి ఏమిటో అర్ధం చేసుకోవచ్చు.

స్థానిక మంత్రి పొన్నం ప్రభాకర్ తన నియోజకవర్గంలో ప్లాస్టిక్ ను నిషేధించాలనే లక్ష్యంతో ప్రతి గ్రామంలో ‘స్టీల్ బ్యాంక్’’ ను ఏర్పాటు చేయడం గొప్ప విషయం. మొన్న ఢిల్లీకి మంత్రి పొన్నం నా వద్దకు వచ్చి నవోదయ స్కూల్ ను మంజూరు చేయాలని కోరారు. వచ్చే విద్యా సంవత్సరంలో నవోదయ స్కూల్ మంజూరు చేస్తాం. అట్లాగే ఇద్దరం కలిసి ఈ నియోజకవర్గంలో సైనిక్ స్కూల్ ను ఏర్పాటు చేసేందుకు క్రుషి చేస్తాం. రాజకీయాలకు అతీతంగా కలిసి పనిచేస్తూ మమ్ముల్ని గెలిపించిన హుస్నాబాద్ సహా కరీంనగర్ పార్లమెంట్ అభివ్రుద్ధికి క్రుషి చేస్తా. అతి త్వరలో నర్సరీ నుండి 6వ తరగతి చదువుకునే విద్యార్థులందరికీ మోదీ కిట్స్ ఇవ్వబోతున్నా. ప్రతి ప్రభుత్వ పాఠశాలలో వాటర్ ప్లాంట్ ను ఏర్పాటు చేయడానికి క్రుషి చేస్తా. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థులు గల్లా ఎగరేసుకునేలా చేస్తా. అందుకోసం స్కూళ్లలో మౌలిక సదుపాయాలు కల్పించేందుకు క్రుషి చేస్తా. నేను ర్యాంకులకు వ్యతిరేకం. నేను కూడా పేదరికంలో పుట్టిన. శిశు మందిర్ లో చదువుకున్నా. సైకిల్ కొనే స్తోమత లేదు. కిరాయికి తీసుకుని సైకిల్ కొనేవాడిని. ఆ బాధ మీకు ఉండకూడదనే ఉద్దేశంతో వ్యాపారులు, పారిశ్రామికవేత్తలు అందించిన సీఎస్సార్ ఫండ్స్ తో ఈ సైకిళ్లను కొని టెన్త్ చదువుకునే విద్యార్థులకు అందజేస్తున్నా. బాగా చదువుకుని తల్లిదండ్రుల ఆశయాలను నెరవేర్చాలని కోరుతున్నా.ఈ రోజు కార్గిల్ దివస్. కార్గిల్ అమరవీరుల త్యాగాలను కేంద్రం వ్రుధా చేయలేదు. ఆనాడు వాజ్ పేయి, ఈనాడు నరేంద్రమోదీ పాకిస్తాన్ ఉగ్రవాదుల వెన్నులో వణుకు పుట్టించారు. పెహల్గాం దాడుల అనంతరం అన్ని పార్టీల ఎంపీల బ్రుందం అన్ని దేశాలకు వెళ్లి పాకిస్తాన్ కుట్రలను ప్రపంచానికి బట్టబయలు చేసిన విషయాన్ని గుర్తు చేసుకోవాలి.సిద్దిపేట జిల్లా కలెక్టర్ హైమావతి మాట్లాడుతూ పిల్లలు తెల్ల పేపర్ లాంటి వాళ్లు. రాగద్వేషాలుండవ్. అట్లాంటి వాళ్లకు మనం ఏం నేర్పిస్తే అది నేర్చుకుంటారు. అట్లాంటి విద్యార్థులను ఉన్నత ఆశయాలు నెరవేర్చుకునే దిశగా తీర్చిదిద్దాలి. పెద్దలపట్ల గౌరవభావాన్ని పెంపొందించాలి. పాజిటివ్ మైండ్ తో మెలిగేలా చేయాలి. తల్లిదండ్రులు తమ పిల్లలపై ఎక్కువ ఆశలు పెట్టుకోవద్దు. వాళ్లు ఉన్నతంగా ఎదిగేందుకు, వాళ్లు ఏ రంగాన్ని ఎంచుకుంటే ఆ రంగంలో అవసరమైన సహాయ సహకారాలు అందించాలని కోరుతున్నా అన్నారు.

Leave A Reply

Your email address will not be published.